హైదరాబాద్, వెలుగు: కొత్త మున్సిపల్ చట్టాన్ని గవర్నర్ తిప్పిపంపడం ప్రజాస్వామ్య శక్తుల విజయమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గవర్నర్ చర్యను బీజేపీ స్వాగతిస్తోందని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వంతో అప్రజాస్వామ్య పద్ధతిలో ఇష్టమొచ్చినట్టు చట్టాలు చేయబోతే గవర్నర్ ఆపడం హర్షణీయమన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని కీలు బొమ్మగా మార్చే ప్రయత్నం జరుగుతోందని గవర్నర్ కు బీజేపీ ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తాము, మిగతా పార్టీలు, ప్రజాసంఘాలు కొత్త మున్సిపల్ చట్టాన్ని వ్యతిరేకించినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని.. మంచి చెబితే వినే పరిస్థితిలో లేదని విమర్శించారు. దొడ్డిదారిన ఆర్డినెన్స్ తీసుకువచ్చే ప్రయత్నం అనైతికమని, దానిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు.
అఖిలపక్షం పెట్టాలె..
వార్డుల విభజన, రిజర్వేషన్, ఎన్నికల ప్రక్రియలో లోపాలున్నాయని దత్తాత్రేయ చెప్పారు. మున్సిపల్ చట్టంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, సూచనలను పరిగణనలోకి తీసుకుని చట్టం చేయాలని డిమాండ్ చేశారు. పంతం నెగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఆదరా బాదరాగా ఎలక్షన్లు జరపడం సరికాదని స్పష్టం చేశారు. 121 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకుగాను సగం వాటిపై రిట్ పిటిషన్లు దాఖలయ్యాయని.. ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వసనీయత పోయిందని ఆరోపించారు. అధికార దుర్వినియోగం చేసి, ఏరకంగానైనా ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని దత్తాత్రేయ ఆరోపించారు.