చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట

చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట

TRS ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. పౌరసత్వ రద్దు ఉత్తర్వులపై నాలుగు వారాల పాటు హైకోర్టు స్టే విధించింది. విచారణను డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత పౌరసత్వానికి చెన్నమనేని అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టింది కోర్టు.

చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుడు కాదని కొందరు బీజేపీ నేతలు గతంలో కోర్టును ఆశ్రయించారు. పౌరసత్వంపై కేంద్ర హోంశాఖ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు  అప్పట్లో స్పష్టం చేసింది. తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఇదే అభిప్రాయం తెలిపింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ అన్ని వివరాలు పరిశీలించి, ఆయన భారత పౌరుడు కాదని, ఇక్కడ ఎలాంటి అధికారాలు పొందేందుకు అర్హుడు కాదని ప్రకటించింది.