- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ.46 వేల కోట్లు
- ఒక్క మార్చి క్వార్టర్లోనే రూ.12,594 కోట్ల లాభం
- షేరుకి రూ.19 డివిడెండ్ ప్రకటించిన బ్యాంక్ బోర్డ్
న్యూఢిల్లీ :హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరోసారి అదరగొట్టింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్ (క్యూ4) లో బ్యాంక్కు రూ. 12,594.5 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్లో వచ్చిన ప్రాఫిట్తో పోలిస్తే ఇది 20.6 శాతం ఎక్కువ. బ్యాంక్ రెవెన్యూ 20.3 శాతం పెరిగి రూ. 28,733.9 కోట్ల నుంచి రూ.34,552.8 కోట్లకు ఎగిసింది. 2022–23 ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే బ్యాంక్ నికర లాభం 20.9 శాతం పెరిగి ఏకంగా రూ.45,997.1 కోట్లకు చేరుకుంది. స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన చూస్తే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు క్యూ4 లో రూ.32,083 కోట్ల రెవెన్యూ వచ్చింది.
ఇందులో నికర వడ్డీ ఆదాయం కింద రూ.23,351.8 కోట్లు వచ్చాయి. కిందటేడాది మార్చి క్వార్టర్లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.18,872.7 కోట్లుగా ఉంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.1 శాతంగా (అసెట్స్పై) నమోదయ్యింది. వడ్డీయేతర ఆదాయం కింద హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు రూ.8,731.2 కోట్లు వచ్చాయి. కిందటేడాది మార్చి క్వార్టర్లో వచ్చిన రూ.7,631.1 కోట్లతో పోలిస్తే ఇది 27.2 శాతం ఎక్కువ. ఫీజులు, కమీషన్లు వంటివి వడ్డీయేతర ఆదాయం కిందకు వస్తాయి.
బ్యాంక్ ఖర్చులు ఏడాది ప్రాతిపదికన 32.6 శాతం పెరిగి క్యూ4 లో రూ.13,462.1 కోట్లుగా రికార్డయ్యాయి. బ్యాంక్ ప్రొవిజన్లు తగ్గాయి. కిందటేడాది మార్చి క్వార్టర్లో రూ.3,312.4 కోట్లను ప్రొవిజన్లు, కాంటింజెన్సీల కింద కేటాయించగా, ఈ ఏడాది మార్చి క్వార్టర్లో రూ.2,685.4 కోట్లు కేటాయించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బ్యాలెన్స్షీట్ మార్చి క్వార్టర్ ముగిసేనాటికి 19.2 శాతం వృద్ధి సాధించి రూ.24,66,081 కోట్లకు చేరుకుంది.
ఎన్పీఏలు తగ్గినయ్
ఈ ఏడాది మార్చి క్వార్టర్ నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిపాజిట్లు రూ.18,83,395 కోట్లకు చేరుకున్నాయి. ఏడాది ప్రాతిపదికన డిపాజిట్లు 20.8 శాతం ఎగిశాయి. బ్యాంక్ గ్రాస్ ఎన్పీఏల రేషియో క్యూ4 లో 1.12 శాతానికి మెరుగుపడింది. కిందటేడాది డిసెంబర్తో ముగిసిన క్వార్టర్లో బ్యాంక్ గ్రాస్ ఎన్పీఏల రేషియో 1.23 శాతంగా, మార్చితో ముగిసిన క్వార్టర్లో 1.17 శాతంగా రికార్డయ్యింది. నికర ఎన్పీఏల రేషియో క్యూ4 లో 0.27 శాతంగా ఉంది. బ్యాంక్ సబ్సిడరీలలో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కు క్యూ4 లో రూ.486.1 కోట్ల రెవెన్యూ, రూ.193.8 కోట్ల నికర లాభం వచ్చింది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్కు రూ.2,262.5 కోట్ల రెవెన్యూ, రూ.545.5 కోట్ల నికర లాభం వచ్చింది.
హయ్యస్ట్ డివిడెండ్..
2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను షేరుకి రూ. 19 ఫైనల్ డివిడెండ్ ఇచ్చేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. బ్యాంక్ లిస్టింగ్ అయిన తర్వాత ఇచ్చిన డివిడెండ్లలో ఇదే హయ్యస్ట్ కావడం విశేషం. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను షేరుకి రూ. 15.5 డివిడెండ్ ఇచ్చింది. డివిడెండ్ కోసం ఈ ఏడాది మే 16 ను రికార్డ్ డేట్గా నిర్ణయించారు. అంటే ఈ తేదీ నాటికి షేరుహోల్డర్లుగా ఉన్నవారికి డివిడెండ్ వస్తుంది. రిజల్ట్స్ మెరుగ్గా ఉండడంతో పాటు, డివిడెండ్ ఎక్కువగా ఇస్తుండంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు సోమవారం పెరిగే అవకాశం ఉంది. గురువారం సెషన్లో బ్యాంక్ షేర్లు 0.5 శాతం పెరిగి రూ.1,692.45 వద్ద సెటిలయ్యాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవిచ్చారు.