తెలంగాణ జాగృతి పేరుతో కోట్లు కొల్లగొట్టిన్రు

తెలంగాణ జాగృతి పేరుతో కోట్లు కొల్లగొట్టిన్రు

తెలంగాణ ముసుగులో ప్రజల ఆకాంక్షలను అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే లబ్ధి పొందిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. ప్రజలు, యువకులను రెచ్చగొట్టి తెలంగాణ సంపదను దోచుకోవడానికే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు. ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ తలరాతలు మారతాయని ఆశపడిన  నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు...అమరవీరుల కుటుంబాలను ఆర్థిక సాయం చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉద్యమ ద్రోహులను పార్టీలో చేర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యపై గొప్పలు చెప్పుకోవడమే కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదన్నారు. 

యువతను మత్తుకు బానిసలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా మారుస్తామని చెప్పిన కేసీఆర్..దాన్ని విష నగరంగా మారుస్తున్నారని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డ 8 ఏండ్లలో 1,35,000 కోట్లు ఆదాయాన్ని లిక్కర్ పేరుతో పెంచుకుందన్నారు.దేశంలో అత్యధిక లిక్కర్ సేల్స్ తెలంగాణ లోనే జరుగుతున్నాయన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్  ఆరోపించారని..గతంలో కవితతో ఆయన కలిసి పనిచేశారన్నారు. కమలనాథుల ఆరోపణలపై కవిత ఎందుకు తప్పుపట్టడం లేదని ప్రశ్నించారు. ఆదాయ మార్గాలు లేకుండా కవితకు వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.  

సీఎం కేసీఆర్ వెంటనే కవితను బర్తరఫ్ చేయాలన్నారు. లిక్కర్ స్కాం లో కవిత పాత్ర ఏంటో ఆధారాలతో సహా బయటపెట్టాలని పర్వేశ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసి దర్యాప్తు కు సహకరించాలన్నారు. తెలంగాణ జాగృతి పేరుతొ కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్నారు. కేసీఆర్ కుటుంబీకులపై ఈడీ, సీబీఐ  దర్యాప్తు చేయాలని సూచించారు. లిక్కర్ స్కాం లో కేసీఆర్ పాత్ర పైనా సిబిఐ, ఈడి దర్యాప్తు చేయాలని..ఆప్ నేతలపై కూడా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలని సూచించారు. కాళేశ్వరం అవినీతి పై కేంద్రం దర్యాప్తు జరపాలన్నారు. 

లిక్కర్ స్కాం లో చిక్కుకున్న కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు.. రాష్ట్రం రాక ముందు కేసీఆర్ కుటుంబం ఆస్తి ఎంత ఉంది..ఇప్పుడు ఎంత ఉందో చెప్పాలన్నారు. సోనియాగాంధీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే  తెలంగాణ ఏర్పడిందన్నారు.రాష్ట్ర అధికారులు టిఆర్ఎస్ తొత్తులుగా పనిచేస్తున్నారని..దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదన్నారు.కేంద్ర దర్యాప్తు సంస్థల ఆధ్వర్యంలో లిక్కర్ స్కాం పై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పై దర్యాప్తు కేంద్రం ఎందుకు ఆలస్యం చేస్తుందని..బిజెపి టిఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయి కాబట్టే ఆలస్యం జరుగుతుందన్న అనుమానం కలుగుతోందన్నారు. 

రాష్ట్ర బీజేపీ నాయకత్వం కవితపై దర్యాప్తుకు డిమాండ్ చేయాలన్నారు. దర్యాప్తు ఆలస్యం జరిగితే ఆధారాలు మాయం చేయడం లో కవిత దిట్ట అన్నారు. టానిక్ ల పేరుతో సంతోష్ మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నరని..2014లో కవిత ఆదాయం ఎంత ఇప్పుడు ఎంత ఆదాయం ఉందో  విచారణలో బయటపడతాయన్నారు.సీబీఐ ఈడి వెంటనే దాడులు చేస్తే కవిత అక్రమ ఆస్తులు ,లిక్కర్ స్కాం బయటపడుతుందన్నారు.