దావత్​కు పిలిచి కర్రలతో కొట్టి చంపారు

దావత్​కు పిలిచి కర్రలతో కొట్టి చంపారు
  •      రాయదుర్గంలో యువకుడి దారుణ హత్య

గచ్చిబౌలి, వెలుగు: దావత్ చేసుకుందాం రమ్మని చెప్పి, రాయదుర్గంలో ఓ యువకుడిని కొట్టి చంపారు. ఇన్​స్పెక్టర్​ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకిలో ఉండే విశాల్​సింగ్(32) హౌస్​కీపింగ్ జాబ్ చేస్తుంటాడు. మణికొండకు చెందిన యువతి(25) టోలిచౌకిలోని విశాల్​సింగ్​ ఇంటి ముందున్న అమ్మమ్మ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేది. ఈ క్రమంలో తనను ప్రేమించాలని విశాల్​ కొంత కాలంగా ఆమె వెంటపడుతున్నాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు అతన్ని మందలించారు. అయినా తీరు మారలేదు. 

అయితే యువతి సోదరుడు శ్యామ్, అర్జున్​సింగ్, విశాల్​సింగ్​ఫ్రెండ్స్. ఈ నెల 8న శాలరీ పడ్డాక దావత్​ఇస్తానని చెప్పి శ్యామ్​విశాల్​సింగ్​ను పిలిచాడు. రాత్రి 8 గంటలకు మణికొండకు రప్పించాడు. అక్కడ విశాల్​సింగ్, శ్యామ్, అర్జున్​ ముగ్గురూ కలిసి మద్యం తాగారు. ఆ టైంలో విశాల్​సింగ్ తాను శ్యామ్​సోదరిని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. మద్యం మత్తులో యువతిని బూతులు తిట్టాడు. తట్టుకోలేకపోయిన శ్యామ్, అర్జున్​సింగ్, మరి కొందరితో కలిసి విశాల్​సింగ్​పై కర్రలతో దాడి చేశారు. 

విషయం తెలుసుకున్న విశాల్ సోదరుడు ఉదయ్​ అక్కడికి చేరుకుని విశాల్​ను అర్ధరాత్రి 12 గంటలకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 2 గంటలకు చనిపోయాడు. మృతుడి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విశాల్​హత్యలో శ్యామ్, అర్జున్​సింగ్​తోపాటు సుమెన్, రాజేశ్, సోని, అరుణ్ పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.