- కరోనా సెకండ్ వేవ్పై హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిక
- గ్రామాల్లో 30% మందిలోనే యాంటీబాడీస్ ఉన్నయ్
- సిటీల్లో జరిగినట్టు ఊర్లల్లో వ్యాక్సినేషన్ స్పీడ్గా జరగట్లే
- వచ్చే మూడు నెలలు జనం జాగ్రత్తగా ఉండాలి
- కేసులతో పాటు మరణాలు కూడా పెరగొచ్చు
- జనం రూల్స్ పాటించకనే కేసులు పెరుగుతున్నయ్
ఈ ఏడాది మార్చి నెలలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యా యని కేంద్రం వెల్లడించింది. ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ లో వైరస్ వేగంగా వ్యాపిస్తోందని తెలిపింది. గత ఏడాది జూన్ లో 5.5 శాతం ఉన్న కేసుల గ్రోత్ రేట్ .. మార్చిలో 6.8 శాతంగా నమోదైనట్టు పేర్కొంది. ఫిబ్రవరి 14న రోజువారీ కేసులు 12,923 నమోదు కాగా, మార్చి 31న 53,480 రికార్డ్ అయినట్టు తెలిపింది. డెత్ రేట్ కూడా మార్చిలో 5.5 శాతంగా నమోదైనట్టు చెప్పింది. ఫిబ్రవరిలో రోజువారీ మరణాలు 100 నమోదు కాగా, మార్చి 31 నాటికి 354కు పెరిగాయంది. 11 రాష్ట్రాలు, యూటీల్లో పరిస్థితి సీరియస్ గా ఉందని, వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లోకి వైరస్ వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ లో కరోనా పీక్ టైమ్ లో రోజూ 97 వేల కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 81 వేల కేసులు రికార్డవుతున్నాయని కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్ వేవ్ ముప్పు ఈసారి గ్రామాల్లోనే ఎక్కువ ఉంటుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో 25 నుంచి 30 శాతం మందిలోనే యాంటీబాడీస్ ఉన్నాయని సీరో సర్వేలో తేలిందని, కాబట్టి ఇంకో 70 నుంచి 75 శాతం మందికి వైరస్ సోకే ముప్పు ఉందని చెబుతున్నారు. వ్యాక్సినేషన్ కూడా సిటీలో జరిగినంతగా ఊర్లల్లో జరగట్లేదని, కాబట్టి ఊర్లపైనే వైరస్ దాడి ఎక్కువగా ఉండొచ్చని వివరిస్తున్నారు. వైరస్ ఒకసారి వచ్చిన వాళ్లకు, మళ్లీ సోకే చాన్స్ చాలా తక్కువని.. అందుకే సిటీలో నెమ్మదిగా, గ్రామాల్లో వేగంగా వ్యాపించే చాన్స్ ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఊర్లపై ఫోకస్ చేయాలని, జిల్లాల్లోని హాస్పిటళ్లలో అన్ని రకాల వసతులు కల్పించాలని సూచిస్తున్నారు. సెకండ్ వేవ్ మరో 3 నెలలు కొనసాగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వచ్చే మూడు నెలలు జనం అత్యంత జాగ్రత్తగా ఉండాలని, కేసులు పెరుగుతున్న కొద్దీ మరణాలూ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మూడు నెలల తర్వాత వైరస్ వ్యాప్తి నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలు, ప్రజలు వ్యవహరించే తీరును బట్టి ఈ టైమ్ పీరియడ్ మారొచ్చని చెప్పారు.
పరిస్థితి ఇలాగే ఉంటే ప్రమాదమే
ఫస్ట్ వేవ్ పీక్కు వెళ్లాక నాలుగైదు నెలలు గ్యాప్ వచ్చింది. ఈలోగా జనాలు రూల్స్ మర్చిపోయారు. వైరస్ సోకిన వాళ్లలో వచ్చిన ఇమ్యూనిటీ కూడా చాలా వరకు తగ్గి ఉంటుంది. ఇవన్నీ సెకండ్ వేవ్కు కారణాలే. నిరుడు లాక్డౌన్, జనాలు జాగ్రత్తగా ఉండటంతో వైరస్ వ్యాప్తి నెమ్మదిగా సాగింది. ఈసారి అన్నీ ఓపెన్ ఉన్నాయి. జనాల మూవ్మెంట్ కూడా ఎక్కువుంది. మాస్కులు వాడండి, సోషల్ డిస్టన్స్ పాటించండి అంటూ.. బార్లు, సినిమా హాళ్లు ఓపెన్ చేసి పెట్టారు. అందుకే వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కొత్త వేరియంట్లలో వేగంగా వ్యాపించే లక్షణం ఉండటమూ ఓ కారణం. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు ప్రమాదమే. కేసులు పెరుగుతున్నాకొద్దీ మరణాలూ పెరుగుతాయి, వచ్చే నాలుగైదు నెలలు వైరస్తో ఇబ్బంది పడక తప్పదు. జనాలు రూల్స్ పాటిస్తూ.. ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేగం పెంచితే 3 నెలల్లో కంట్రోల్లోకి రావొచ్చు.
- డాక్టర్ బుర్రి రంగారెడ్డి, ఎపిడమాలజిస్ట్, ఇన్ఫెక్షిస్ డిసీజ్
కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్
ఒకట్రెండు నెలలే ఉంటది
మా అంచనా ప్రకారం సెకండ్ వేవ్ ఒకట్రెండు నెలలే ఉంటుంది. తర్వాత నెమ్మదిగా తగ్గుతుంది. డిసెంబర్లో మేం చేసిన సీరో సర్వే ప్రకారం గ్రేటర్ హైదరాబాద్లో అప్పటికే 54 శాతం మందికి యాంటీబాడీస్ వచ్చేశాయి. సెకండ్ వేవ్, వ్యాక్సినేషన్తో ఇంకో 2నెలల్లో ఇది 60 నుంచి 70 శాతానికి చేరొచ్చు. కాబట్టి హెర్డ్ ఇమ్యునిటీ వచ్చి వైరస్ వ్యాప్తి తగ్గే చాన్స్ ఉంది. రూరల్లో మాత్రం 25 నుంచి 30 శాతం మందిలోనే యాంటీబాడీస్ ఉన్నాయి. వ్యాక్సినేషనూ వేగంగా జరగట్లేదు. కాబట్టి ఈసారి గ్రామాలపైనే వైరస్ దాడి ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నాం.
- డాక్టర్ లక్ష్మయ్య, సీనియర్ సైంటిస్ట్, ఎపిడమాలజిస్ట్, ఎన్ఐఎన్, హైదరాబాద్
ఊర్లపై ఫోకస్ చేశాం
వైరస్ చాలా స్పీడ్గా వ్యాపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే గ్రేటర్లో మే నెల మధ్యలోనే వ్యాప్తి పీక్కు వెళ్లేలా ఉంది. జిల్లాల్లో జూన్ ఎండింగ్లో పీక్ స్థాయికి వెళ్లొచ్చని అనుకుంటున్నాం. ఇలా వేగంగా విస్తరిస్తే హాస్పిటళ్లపై ఒత్తిడి పెరిగి పేషెంట్ కేర్ మేనేజ్మెంజ్పై ప్రభావం చూపే చాన్స్ ఉంది. అందుకే వైరస్ స్పీడ్ను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వ్యాక్సినేషన్ వేగం పెంచాం. వైరస్ ప్రభావం ఈసారి గ్రామాల్లోనే ఎక్కువగా ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతుండటంతో జిల్లాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లు పెంచాం. వ్యాక్సిన్ వేసుకునేలా జనాలను ఒప్పించేందుకు మా హెల్త్ వర్కర్లు ప్రయత్నిస్తున్నారు. జిల్లాల్లోని హాస్పిటళ్లలో అన్ని వసతులు కల్పించాం. మా సైడ్ నుంచి ఎంత చేసినా ప్రజలు మాస్క్, సోషల్ డిస్టెన్స్ వంటి రూల్స్ పాటించాలి. అప్పుడే వైరస్ను కంట్రోల్ చేయగలం.
- డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్,
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్