కటాఫ్ తగ్గింపుతో అర్హత సాధించినోళ్లంతా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : కేంద్రం

కటాఫ్ తగ్గింపుతో అర్హత సాధించినోళ్లంతా  రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : కేంద్రం

నీట్ పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన కటాఫ్ మార్కులను తగ్గిస్తున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది.  అన్ని కేటగిరిల వారికి కటాఫ్ మార్కులను 25 శాతం చొప్పున తగ్గించినట్లు వెల్లడించింది. జనరల్ కేటగిరి అభ్యర్థులకు 25 శాతం, జనరల్ కేటగిరిలోని దివ్యాంగులకు 20 శాతం,  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు,ఈ విభాగాల్లోని  దివ్యాంగులకు 15 శాతం మేర కటాఫ్ మార్కులను తగ్గించినట్లు తెలిపింది.  ఈమేరకు కటాఫ్ మార్కుల తగ్గింపు అనంతరం నీట్ పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం అర్హత సాధించేందుకు జనరల్ కేటగిరి అభ్యర్థులు 24.28 శాతం, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 14.29 శాతం, దివ్యాంగులు 19.29 శాతం చొప్పున మార్కులు పొందితే సరిపోతుంది.

ఈనేపథ్యంలో కటాఫ్ మార్కుల తగ్గింపు అనంతరం అడ్మిషన్లకు అర్హత సాధించిన అభ్యర్థులు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేయించుకొని, మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ లో పాల్గొనాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. అర్హత సాధించిన అభ్యర్థులందరికీ దీనిపై సమాచారాన్ని అందించింది. గత  సెషన్ లో జరిగిన పీజీ మెడికల్ కోర్సుల కౌన్సెలింగ్ లో 1400 సీట్లు భర్తీ కాలేదు. ఇలా మిగిలిపోతున్న సీట్లను భర్తీ చేసే ఉద్దేశంతోనే కటాఫ్ మార్కులను తగ్గించినట్లు తెలుస్తోంది. ఇక రెండోవిడత కౌన్సెలింగ్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అక్టోబరు 19న విడుదల చేశారు. మూడో విడత కౌన్సెలింగ్ అక్టోబరు 31 నుంచి నవంబరు 4 వరకు జరగనుంది.