ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై రాజాసింగ్ తరపు న్యాయవాది ఎల్ రవి చందర్ వాదనలు వినిపించారు. రాజాసింగ్ పై నమోదైన పీడీ యాక్ట్ ను వెంటనే ఎత్తి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇది కేవలం కక్ష సాధింపేనన్న ఆయన... ప్రజల చేత ఎన్నుకున్న నాయకుడు జైల్లో ఉంటే పాలన కుంటుపడుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. రాజాసింగ్ విషయంలో పీడీ యాక్ట్ నిబంధనలను పోలీసులు ఎక్కడా పాటించలేదని ఆరోపించారు. దీంతో న్యాయవాది రవి చందర్ వాదనలు ముగిశాయి. రేపు ఈ కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
అంతకుముందు రాజాసింగ్ పై పీడీ యాక్ట్కు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు.. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో కౌంటర్ సమర్పించింది. ఇదిలా ఉండగా తన భర్తపై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారంటూ రాజాసింగ్ భార్య గత కొన్ని రోజుల క్రితమే హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ను సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది. పీడీ యాక్ట్ను ఎత్తివేయాలని రాజాసింగ్ భార్య ఉషాబాయి వేసిన రివోక్ పిటిషన్ను రిజెక్ట్ చేసింది. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన కోర్టు... సుప్రీంకోర్టు ప్రొసీజర్ ప్రకారమే చర్యలు తీసుకున్నారని స్పష్టం చేసింది. ర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న రాజాసింగ్పై నిబంధనల ప్రకారం ఏడాది కాలం పీడీ అమలు చేయాలని ఆదేశించింది.