కరోనా వ్యాక్సిన్ కు.. గుండెపోటులకు సంబంధమే లేదంట

కరోనా వ్యాక్సిన్ కు.. గుండెపోటులకు సంబంధమే లేదంట

భారతదేశంలో గత మూడేళ్లలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో కొంతమంది పరిశోధకులు ఓ అధ్యయనం చేసి కరోనా వ్యాక్సిన్ కు గుండెపోటు కేసులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు.  ముఖ్యంగా.. కరోనా వైరస్ మన దేశంపై దాడి చేసినప్పటి నుంచి గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఒకప్పుడు వయసు పైబడిన వాళ్లు మాత్రమే ఈ గుండెజబ్బు బారిన పడగా.. కరోనా వైరస్ విజృంభణ తర్వాత యుక్త వయసులో ఉన్న వారు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. కరోనా వ్యాక్సిన్ వల్లే గుండెపోటు ముప్పు పెరిగిందనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. యువకులకు కూడా గుండెపోటు రావడానికి కారణం.. ఈ కరోనా వ్యాక్సినేనని జనాలు బలంగా నమ్మడం మొదలుపెట్టారు.

కరోనా వైరస్(Corona) వచ్చాక.. దానిని అరికట్టేందుకు వివిధ కంపెనీలు వ్యాక్సిన్లు(Vaccines) తయారు చేశాయి. భారత ప్రభుత్వం రెండు డోసుల వ్యాక్సిన్ ను ఉచితంగా అందించింది. కోవిడ్ వ్యాక్సిన్ల తర్వాత.. గుండెపోటు మరణాలు పెరిగాయని, కరోనా బారిన పడినవారికి గుండెపోటు ముప్పు అధికంగా ఉంటుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ కారణంగానే గుండెపోటు(Heart Attack) వస్తుందన్న అనుమానాలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం పలు కేంద్రాల్లో పరిశోధనలు చేపట్టింది. తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో.. కోవిడ్ వ్యాక్సిన్లకు – గుండెపోటు మరణాలు పెరుగుదలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది.కరోనా వ్యాక్సిన్ వల్ల గుండెపోటు కేసులు పెరగడం లేదని.. మన దేశంలో కరోనా వ్యాక్సిన్‌లు సురక్షితమైనవేనని తెలిపింది. ఇందుకు సంబంధించిన నివేదిక.. పీఎల్‌ఓఎస్‌ వన్‌ జర్నల్‌లో ప్రచురించబడింది.

 భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌లు సురక్షితమని తాము చేసిన అధ్యయనంలో రుజువైందని... అధ్యయనానికి అధ్యక్షత వహించిన జీబీ పంత్‌ ఆస్పత్రికి చెందిన మోహిత్‌ గుప్తా తెలిపారు. గుండెపోటుకు వ్యాక్సిక్‌లతో సంబంధం లేదని.. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో గుండెపోటు మరణాలు తక్కువగా ఉన్నాయని గుర్తించామని చెప్పారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అక్యూట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (AMI) ఎప్పుడూ కనిపించలేదని తమ విశ్లేషణలో తేలినట్లు చెప్పారు. వయసు, మధుమేహం, ధూమపానం కారణాల వల్లే మరణం ముప్పు ఎక్కువగా కనిపించిందని తెలిపారు.

రోగుల ప్రాణాలను కాపాడటంలో వ్యాక్సిన్ కీలక పాత్ర పోషించిందని ఈ పరిశోధన అధికారులు తెలిపారు. రోగం తీవ్రంగా ఉన్నవారిలో కోవిడ్ వ్యాక్సిన్‌ని అందించడం వల్ల.. కరోనా వైరస్ బారి నుంచి వాళ్లు బయటపడ్డారన్నారు. ఫలితంగా.. మరణాల రేటును తగ్గిందచన్నారు. వ్యాక్సిన్ వల్ల ఏ రోగికి కూడా గుండెపోటు రాలేదని.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 30 రోజుల్లో 2 శాతం మంది రోగులు మాత్రమే మరణించారని అన్నారు. ఆ మరణాలు కూడా వ్యాక్సిన్ వల్ల సంభవించలేదన్నారు. వైరస్ సోకిన రోగులలో మరణాల రేటును తగ్గించడంలో కరోనా వ్యాక్సిన్ చాలా సహాయపడిందని వాళ్లు చెప్పుకొచ్చారు.

కాగా.. ఈ అధ్యయనం ఢిల్లీలోని జీబీ పంత్‌ ఆస్పత్రిలో జరిగింది. ఆగస్టు 2021 2022   మధ్య కాలంలో ఆ ఆసుపత్రిలో చేరిన 1578 మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో 1086 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కాగా.. 492 మంది టీకా తీసుకోలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 1047 (96 శాతం) మంది రెండు డోసులు తీసుకోగా.. మరో 4శాతం మాత్రం కేవలం ఒక డోసు తీసుకున్నారు. ఆసుపత్రిలో చేరిన ఏఎంఐ (అక్యూట్ మయోకార్డియర్ ఇన్ ఫార్ క్షన్) బాధితుల్లో వయోభారం, షుగర్, ధూమపానం కారణాలవల్లే గుండెపోటు ముప్పు ఎక్కువగా కనిపించిందన్నారు. ఈఅధ్యయనం ఒక కేంద్రంలో మాత్రమే జరిగిందని, దీనికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.