రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భారీగా వస్తున్న వరద నీటితో నిండుకుండలా మారాయి. చెరువులు, వాగులు నిండి అలుగు పోస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా పార్వతి బ్యారేజ్ 4 గేట్లు ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు అధికారులు. ఇన్ ఫ్లో 3 వేల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3 వేల క్యూసెక్కులు నమోదైంది. బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 8.83 టీఎంసీపలు కాగా ప్రస్తుత నీటి నిలువ 4.325 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజ్ కు 97 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 35 గేట్లు ఎత్తి 93 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కొమురం భీమ్ జిల్లా వట్టి వాగు ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది.రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 239.500 మీటర్లు కాగా ప్రస్తుతం 238.200 మీటర్ల వరకు వరద నీరు చేరింది.ఇన్ ఫ్లో 2 వేల 405 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 2 వేల 405 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694 అడుగుల వరకు వరద నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో 8 వేల 6 వందల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో ఒక వెయ్యి 102 క్యూ సెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ ఫ్లో 251.58 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 275.58 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 640.30 అడుగుల వరకు నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్ధ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.28 టీఎంసీల నీరు ఉంది.
మరోవైపు ఆడ ప్రాజెక్టుకు కూడా వరద ఉతధృతి పెరిగింది. రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా, ప్రస్తుతం 241.300 మీటర్ల వరకు నీరు చేరుకుంది. ఇన్ ఫ్లో ఒక వెయ్యి 90 క్యూ సెక్కులు కాగా ఔట్ ఫ్లో ఒక వెయ్యి 92 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
