హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన నష్టంపై రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. రాత్రి 7.30 గంటలకు జీఎం స్వయంగా స్టేషన్ను పరిశీలించారు. అయితే వివరాలను రైల్వే అధికారులు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. మూడు ట్రైన్స్లో నాలుగు కోచ్లు ధ్వంసమైనట్లు ఆఫ్ ది రికార్డులో అధికారులు చెప్తున్నారు. రాజ్కోట్ ఎక్స్ప్రెస్లో ఒకటి, అజంతా ఎక్స్ప్రెస్లో రెండు బోగీలు, ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్లో ఒక బోగి ధ్వంసమైంది. ఒక ఎంఎంటీఎస్ ట్రైన్లో ఇంజిన్ దెబ్బతింది. రెండు పార్సిల్ వ్యాన్స్ దగ్ధమయ్యాయి. పార్సిల్ ఆఫీసు ధ్వంసమైంది. పార్సిల్స్లో వచ్చిన 4 బైక్లు కాలిపోయాయి. పార్సిల్స్లో ఉన్న చేపలు, గుడ్లులాంటి ఐటెమ్స్ డ్యామేజ్ అయ్యాయి. టీవీలు, ఫ్యాన్లు, సీసీటీవీలను నిరసనకారులు ధ్వంసం చేశారు. ఒక ఎస్కలేటర్ పాక్షికంగా దెబ్బతింది. ప్లాట్ఫాంలపై ఉండే స్టాళ్లు, వాటర్ కూలర్స్ వంటి వస్తువులు కూడా నేలమట్టమయ్యాయి.
