ఏపీలో మోంథా తుఫాన్ తీరం దాటడంతో దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాత్రి నుంచి కురుస్తోన్న వర్షం ఈదురుగాలలుకు వరి పొలాలు నేల వారిపోయాయి. పొలాలు కోత దశలో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లి గురుకుల పాఠశాల ఆవరణలో భారీగా వర్షపు నీళ్లు చేరాయి. వర్షాల కారణంగా పాఠశాల నీటమునిగింది. పాఠశాలలో ఉన్న 500 మంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందుతున్నారు. పాఠశాల వాగుకు దగ్గరగా ఉండటంతో విద్యార్థులు భయపడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఏఎస్పీ మౌనిక, జేసీ శ్రీనివాస్, RDO రమణారెడ్డి పాఠశాల సందర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు కలెక్టర్.
మరో వైపు బొల్లెపల్లి - సంగెం ,చౌటుప్పల్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంగెం బీమా లింగం కత్వా వద్ద రోడ్డు లెవల్ బ్రిడ్జి మీద నుంచి ఉదృతంగా మూసీ ఉదృతంగా ప్రవహిస్తోంది.
భారీ వర్షాలకు నెల్లికుదుర్ మహబూబాబాద్ ప్రధాన రహదారిపై గాలిదుమరానికి భారీ చెట్టు విరిగి పడింది. నెల్లికుదుర్ మండలం రావిరాల గ్రామంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను తీసుకురావడానికి వెళ్ళుతున్న 108 అంబులెన్స్ కు రోడ్డుకు అడ్డంగా చెట్టుపడింది. ప్రధాన రహదారి పై పడిన పెద్ద చెట్టును సాహసోపేతంగా గొడ్డలితో నరికి అంబులెన్స్ కు దారి క్లియర్ చేశారు 108 సిబ్బంది.. మహిళను ఆసుపత్రిలో చేర్పించారు .
మహబూబాద్ జిల్లా డోర్నకల్ లో రైల్వే శాఖపై తుఫాన్ ఎఫెక్ట్ పడింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డోర్నకల్ లో రైల్వే ట్రాక్ పైకి భారీగా వచ్చి చేరింది వరద నీరు.దీంతో రైల్వే స్టేషన్లో నిలిచిపోయాయి ట్రైన్లు. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లనున్న గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైల్వే ట్రాక్ పై నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
మరో వైపు రాగల 3గంటలు హైదరాబాద్ తో పాటు,హన్మకొండ,జోగులాంబ గద్వాల జిల్లా, మహబూబాబాద్,మహబూబ్ నగర్ , మేడ్చల్ మల్కాజ్ గిరి,, నారాయణపేట, రంగారెడ్డి, వరంగల్,వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖా భారీ వర్ష సూచన చేసింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సూచించింది వాతావరణ శాఖ.
