
- జిల్లా కేంద్రంలో రోడ్లపై వరద నీటి ప్రవాహం
- తాడ్వాయి మండలంలో మెయిన్ రోడ్డుపై పడిన చెట్లు
- బీర్కూర్లో 9.8 సెం.మీ. వర్షపాతం నమోదు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో సోమవారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు, ఈదురుగాలులతో జిల్లాలో పలు చోట్ల వర్షం దంచికొట్టింది. బీర్కూర్లో అత్యధికంగా 9.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తాడ్వాయి మండలంలో చెట్లు పడిపోయి రాకపోకలకు ఇబ్బంది కలిగింది. 3 రోజులుగా ఉక్కపోత, వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.
బీర్కూర్లో 9.8 సెం.మీ, తాడ్వాయి మండలంలో 7.9 సెం.మీ, జుక్కల్లో 7.7 సెం.మీ, కామారెడ్డిలో 7.5 సెం.మీ, సదాశివనగర్లో 7.3 సెం.మీ, రామారెడ్డిలో 6.6 సెం.మీ, మద్నూర్లో 5.7, సోమూర్లో 5.6, డొంగ్లిలో 5.4, పుల్కల్లో 5.3, బిచ్కుందలో 5.2, నస్రుల్లాబాద్లో 4.9 సెం.మీ, గాంధారిలో 3.6, ఆర్గొండలో 3.6 , బొమ్మదేవునిపల్లిలో 3.2, పాతరాజంపేటలో 3, ఇసాయిపేటలో 2.9 , లింగంపేటో 2.8, కొల్లూర్లో 2.6 , మాచాపూర్లో 2.4, నిజాంసాగర్లో 2.2, వెల్పుగొండలో 2 , మాచారెడ్డిలో 1.5 , రాంలక్ష్మన్పల్లిలో 1.4 , నాగిరెడ్డిపేటలో 1.2, పిట్లంలో 1.1 సెం.మీ, చొప్సున వర్షపాతం నమోదైంది.
భారీ వర్షానికి ఇబ్బందులు
జిల్లాలో కురిసిన భారీ వర్షంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. తాడ్వాయి మండలంలో వర్షం, ఈదురు గాలులకు చెట్లు పడిపోయాయి. కామారెడ్డి- ఎల్లారెడ్డి మెయిన్ రోడ్డుపై చెట్లు పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. పోలీసు అధికారులు వెంటనే జేసీబీతో రోడ్డుపై పడిపోయిన చెట్లను తొలగించారు. జిల్లా కేంద్రంలో రోడ్లపై వరద నీరు ప్రవహించింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కంపౌండ్వాల్ కొంత మేర పడిపోయింది. కాకతీయనగర్ కాలనీ వైపు గోడ కొంత భాగం కూలిపోవడంతో మున్సిపల్అధికారులు రాళ్లు, మట్టిని తొలగించారు. సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లో నీళ్లు ప్రవహించాయి. జిల్లా అంతటా వర్షం కురియడంతో వ్యవసాయ పనులు సాగనున్నాయి.