కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షం .. రోడ్లపై వరద నీటి ప్రవాహం

కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షం .. రోడ్లపై వరద నీటి ప్రవాహం
  • జిల్లా కేంద్రంలో రోడ్లపై వరద నీటి ప్రవాహం
  • తాడ్వాయి మండలంలో మెయిన్​ రోడ్డుపై  పడిన  చెట్లు
  • బీర్కూర్​లో  9.8 సెం.మీ. వర్షపాతం నమోదు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో సోమవారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు, ఈదురుగాలులతో  జిల్లాలో  పలు చోట్ల వర్షం దంచికొట్టింది. బీర్కూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా  9.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తాడ్వాయి మండలంలో  చెట్లు పడిపోయి రాకపోకలకు ఇబ్బంది కలిగింది. 3 రోజులుగా ఉక్కపోత, వేడిమితో ఇబ్బందులు పడుతున్న  ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.  

బీర్కూర్​లో  9.8 సెం.మీ, తాడ్వాయి మండలంలో  7.9 సెం.మీ, జుక్కల్​లో 7.7 సెం.మీ, కామారెడ్డిలో 7.5 సెం.మీ, సదాశివనగర్​లో 7.3 సెం.మీ,  రామారెడ్డిలో 6.6 సెం.మీ, మద్నూర్​లో 5.7, సోమూర్​లో 5.6, డొంగ్లిలో 5.4,  పుల్కల్​లో 5.3, బిచ్​కుందలో 5.2,  నస్రుల్లాబాద్​లో 4.9 సెం.మీ,  గాంధారిలో 3.6, ఆర్గొండలో 3.6 , బొమ్మదేవునిపల్లిలో 3.2, పాతరాజంపేటలో 3, ఇసాయిపేటలో 2.9 , లింగంపేటో 2.8, కొల్లూర్​లో 2.6 , మాచాపూర్​లో 2.4, నిజాంసాగర్​లో 2.2,  వెల్పుగొండలో 2 ,  మాచారెడ్డిలో 1.5 ,  రాంలక్ష్మన్​పల్లిలో 1.4 ,  నాగిరెడ్డిపేటలో 1.2, పిట్లంలో 1.1 సెం.మీ, చొప్సున వర్షపాతం నమోదైంది. 

భారీ వర్షానికి ఇబ్బందులు

జిల్లాలో కురిసిన భారీ వర్షంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.  తాడ్వాయి మండలంలో  వర్షం, ఈదురు గాలులకు చెట్లు పడిపోయాయి.  కామారెడ్డి- ఎల్లారెడ్డి  మెయిన్​ రోడ్డుపై చెట్లు పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. పోలీసు అధికారులు వెంటనే జేసీబీతో  రోడ్డుపై పడిపోయిన చెట్లను తొలగించారు.  జిల్లా కేంద్రంలో రోడ్లపై వరద నీరు ప్రవహించింది.  ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కంపౌండ్​వాల్​ కొంత మేర పడిపోయింది. కాకతీయనగర్​ కాలనీ వైపు గోడ కొంత భాగం కూలిపోవడంతో  మున్సిపల్​అధికారులు రాళ్లు, మట్టిని తొలగించారు.  సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లో నీళ్లు ప్రవహించాయి.  జిల్లా అంతటా వర్షం కురియడంతో వ్యవసాయ పనులు సాగనున్నాయి.