రైతులను నిండా ముంచిన వర్షాలు, వరదలు

రైతులను నిండా ముంచిన వర్షాలు, వరదలు
  • నాలుగేళ్లుగా నష్టాల బాటలోనే..
  • ఈసారి 30 వేల ఎకరాలు నీటి పాలు
  • ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌లో రూ.60 కోట్ల నష్టం

భారీ వర్షాలు, వరదలు నిజామాబాద్ జిల్లా రైతులను నిండా ముంచాయి.  ఉమ్మడి జిల్లాలో దాదాపు 1.65 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లగా ఇందులో ఎక్కువగా సోయాబీన్‌‌‌‌ ఉన్నట్లు వ్యవసాయ ఆఫీసర్లు అంచనా వేశారు. 

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో రైతులు వరి తర్వాత సోయాబీన్‌‌‌‌ ను కూడా ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ఖరీఫ్​ నిజామాబాద్ జిల్లాలో 60 వేలు, కామారెడ్డి జిల్లాలో 60 వేల ఎకరాల్లో సోయా వేశారు. మొక్క దశలోనే వారం పాటు భారీ వర్షాలు కురియడం, వరదలతో పొలాల్లోకి నీరు చేరి దాదాపు 5 రోజులుగా ఉన్నాయి. దీంతో వేరు మురిగిపోయి పంట దెబ్బతింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో సోయా పంటలు దెబ్బ తిన్నాయని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఎకరానికి రూ.20 వేల చొప్పున సుమారు రూ.60 కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 

2019 నుంచి లాస్‌‌‌‌లోనే...​
ఇప్పుడే కాదు నాలుగేండ్లుగా సోయా రైతులు నష్టపోతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పరిహారం చెల్లించడం లేదు. 2019లో రాష్ట్రంలో సీడ్స్​కొరత ఏర్పడడంతో రైతులు మహారాష్ట్రలో విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశారు. ఇందులో సీడ్స్‌‌‌‌ సరిగా రాక 12 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. 2020లో అకాల వర్షాలతో  15 వేల ఎకరాల పంట దెబ్బతిన్నది. 2021లో కూడా 15 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మూడేళ్లుగా ఆశించిన దిగుబడి రాకపోవడంతో రైతులకు తీవ్రంగా నష్టపోయారు. ఇక ఈసారి  ఆదిలోనే భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. 

చేయూత అందేనా! 
ఈసారి ఖరీఫ్ ఆరంభంలోనే పంట నష్టం వాటిల్లడంతో సాగు ఖర్చులైనా పరిహారంగా చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో పంటల బీమా అమలు చేయకపోవడంతో నాలుగేండ్లుగా వివిధ కారణాలతో నష్టపోయిన 46 వేల మంది రైతులకు పరిహారం అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ పేరిట పంట బీమాను ఎత్తివేయడం సరికాదని రైతులు అంటున్నారు.   

వరదలతో పంటా పోయింది
నేను మూడు ఎకరాల్లో సోయాబీన్ వేశాను. భారీ వర్షంతో చేనులో వర్షపు నీరు నిలిచింది. దీంతో పంటంతా ముక్కిపోయింది. 40 రోజుల కష్టం వృథా అయింది. ప్రభుత్వం  నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
- గంగాధర్, రైతు, నందిపేట 

పరిహారం ఇయ్యాలే..
వర్షాలకు నష్టపోయిన సోయా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఒక్కో రైతు ఎకరాకు రూ.20 వేల ఖర్చు పెట్టాడు. రైతు బంధు ఇస్తున్నామని వరదలతో నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వకపోవడం సరికాదు.  
- అల్జాపూర్ శ్రీనివాస్, బీజేపీ లీడర్‌‌‌‌‌‌‌‌