వరదల బీభత్సం.. విరిగిపడుతున్న కొండచరియలు

వరదల బీభత్సం.. విరిగిపడుతున్న కొండచరియలు

బ్రెజిల్ లో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వరదలతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోతున్నాయి. చాలా చోట్ల జనజీవన  స్తంభించిపోయింది. ఇప్పటి వరకు 30 మందికి పైగా జనం వరదల ధాటికి చనిపోయారు. మరోవైపు సహాయచర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. గత 24 గంటల్లోనే 30 మందికి పైగా చనిపోయినట్లు బ్రెజిల్ అధికార వర్గాలు తెలిపాయి.

పెర్నమ్ బుకో స్టేట్ లో ఈ వరదలు విరుచుకుపడుతున్నాయి. వెయ్యి మందికి పైగా జనాన్ని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించారు. 33 మున్సిపాలిటీల పరిధిలో ఎమర్జెన్సీ విధించారు. చాలా చోట్ల ఇండ్లు కూలిపోవడం, కొండ చరియలు విరిగిపడుతున్న వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. కార్లు నీట మునిగాయి.  పెర్నమ్ బుకో ఏరియాలో 23 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. సగటున ఒక నెలలో కురవాల్సిన వర్షం ఒక్కరోజులో పడడంతో ఈ వరద పరిస్థితి తలెత్తింది. మరింతగా వర్షాలు కురిస్తే వరదల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని బ్రెజిల్ అధికారులు అలర్ట్ అయ్యారు.