మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. ఆగస్టు 16వ తేదీన  ఈశాన్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీద ఉన్న ఆవర్తనం.. ఈరోజు(ఆగస్టు 17) వాయువ్య బంగాళాఖాతం..దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుండి  4.5 కిలో మీటర్ల నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతూ ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సూచించింది. దీంతో నేటి నుంచి  మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు  రాష్ట్రంలో రేపు, ఎల్లుండి(ఆగస్టు 18, 19) భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు 

ఆగస్టు18, 19వ తేదీల్లో  తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ రెండు రోజుల్లో పలు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.