
బెంగళూరు: కర్నాటకలోని పలు జిల్లాల్లో ఆదివారం కుండపోత వర్షాలు కురిశాయి. వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా చోట్ల సాధారణ జనజీవనం స్తంభించింది. కోస్టల్ ఏరియాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా దక్షిణ కన్నడ జిల్లా అతలాకుతలమైంది. ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 11 నుంచి 21 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా హెడ్ క్వార్టర్స్ మంగళూరులోనూ 17 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అలాగే, ఇదే జిల్లాలో ఉన్న పనంబూర్ అబ్జర్వేటరీలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పొరుగున ఉన్న ఉడుపి, శివమొగ్గ, చిక్కమగళూరు, కొడగు జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. మంగళూరు తాలూకాలోని నేషనల్ హైవే 169 సమీపంలోని కెట్టికల్లు వద్ద కొండచరియలు విరిగిపడడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. వర్షాలు కురిసిన జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బిల్డింగులు, షాపుల్లో వరద నీరు చేరింది. డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. రోడ్లపై వరదనీరు పోటెత్తింది.
పలు చోట్ల ఆస్తులకు నష్టం వాటిల్లింది. బెంగళూరు నుంచి మంగళూరుకు వస్తున్న పలు బస్సులను దారి మళ్లించారు. నివాస ప్రాంతాల్లోకి వరద చేరడంతో మునిసిపల్ కార్పొరేషన్పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందే ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కాగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. అలాగే, పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్అలర్ట్ జారీ చేసింది. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.