ప్రాజెక్టుల్లోకి వరద .. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా వర్షాలు

ప్రాజెక్టుల్లోకి వరద .. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా వర్షాలు
  • ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు 
  • అలుగుపారుతున్న చెరువులు
  • పలు గ్రామాలకు రాకపోకలు బంద్​
  • నిండుతున్న నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులు

నిజామాబాద్​, కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. శనివారం ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. నిజాంసాగర్ ప్రాజెక్ట్​లోకి శనివారం సాయంత్రం 1625 క్యూసెక్కుల వరద వస్తుంది.  కళ్యాణి ప్రాజెక్ట్​లోకి 640 క్యూసెక్కుల నీరు వస్తుంది. పోచారం ప్రాజెక్ట్​లోకి 9వే క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. లింగంపేట పెద్ద వాగు, కాసుల కత్త వాగు, తాడ్వాయి మండలంలోని  భీమేశ్వరం వాగు, దేమీకలాన్​ సమీపంలో వాగు,  రామారెడ్డి మండలంలోని గంగమ్మ వాగు,  సదాశివనగర్ మండలంలోని పెద్ద వాగు, అమర్లబండ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని  పలు చెరువులు అలుగు పారుతున్నాయి. 
  
పలు చోట్ల రాకపోకలు బంద్​..

పోతంగల్ మండలం కొల్లూర్​- దోమలెడ్గి బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా సిమెంట్​ పైప్​లు, మట్టితో ఏర్పాటు చేసిన దారి కొట్టుకుపోయింది.  దీంతో బోధన్​ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రూర్ మండలంలో లింగంపల్లి చెరువు నిండి అలుగు పారి బొప్పాపూర్ రోడ్డు మీదుగా ప్రవహించడంతో దారి క్లోజ్ చేశారు. 

ఇందల్వాయి మండలం లింగాపూర్​ వాగు మీదుగా ధర్పల్లి వెళ్లే వెహికల్స్​ను పోలీసులు  డైవర్ట్​ చేశారు. గంగమ్మ వాగు, కనకల్ దేమే మధ్య వాగు వద్ద రాకపోకలను నిలిపివేశారు.  సదాశివనగర్ మండలం అమర్లబండకు చెందిన విద్యార్థులను గ్రామస్తులు ట్రాక్టర్​తో వాగు దాటించారు. వాగుల వద్ద బారీ కేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు పోలీసు సిబ్బందిని నియమించారు.