మహబూబాబాద్ జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. గార్ల, బయ్యారం మండలల్లో నిన్న(మార్చి 23) అర్థరాత్రి గాలి వాన పడింది. గార్ల మండలం సత్యనారాయణపురం గ్రామంలో మామిడి చెట్లు నేలకొరిగాయి. దీంతో చాలా మామిడికాయలు పగిలిపోయాయి. కొనేవారు లేక కోతులకు , పశువులకు మేతగా వేస్తున్నారు.
నిన్న అర్థరాత్రి గార్ల, బయ్యారం మండలాల్లో కురిసిన అకాల గాలివాన అన్నదాతల ఆశలను అడియాశలు చేసింది. చేతికొచ్చిన పంట కళ్లముందే నేలపాలు చేసింది. ముఖ్యంగా గార్ల మండలం సత్యనారాయణపురంలో పరిస్థితి దయనీయంగా మారింది. గాలివేగానికి మామిడి చెట్లు వేళ్లతో సహా నేలకొరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు రాలిపోయి, పగిలిపోయి చెత్తలా దర్శనమిస్తున్నాయి. మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేక, కనీసం కొనేవారు కరువై ఆ మామిడికాయలను పశువులకు, కోతులకు మేతగా వేయాల్సిన దుస్థితి నెలకొంది.
లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాం.. కౌలు కట్టడానికే దారి లేని స్థితిలో ఉన్నాం అంటూ కౌలు రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వమే మమ్మల్ని అదుకోవాలి, లేదంటే ఆత్మహత్యే మాకు శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . తక్షణమే వ్యవసాయాధికారులు స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు, ముఖ్యంగా కౌలు రైతులకు పరిహారం అందించి వారిని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నారు.
