మేలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 25.82 లక్షలు
తిరుమల, వెలుగు: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు శనివారం పోటెత్తారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 26 గంటల సమయం పడుతోంది. రద్దీ కారణంగా గదులు దొరక్క భక్తులు ఇబ్బంది పడ్డారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు 66,360 మంది భక్తులు వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రూ.2.64 కోట్ల హుండీ కానుకలు లభించాయి. మే నెలలో 25,82,494 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, గత ఏడాది మే నెలతో పోలిస్తే 1.20 లక్షల మంది అధికమని టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు చెప్పారు. నారాయణగిరి ఉద్యానవనాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. “భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేశాం. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు పరిమితం చేశాం. మరో 10 రోజులు రద్దీ ఎక్కువగా ఉంటుంది” అని అన్నారు.