
- నిషేదాజ్ఞలు.. ట్రాఫిక్ నియంత్రణ
నిజామాబాద్, వెలుగు: జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభించేందుకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్షా ఇందూర్ సిటీకి రానున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న ఆయన నగరంలో ఉన్నంతసేపు నిఘా నీడలో పర్యటించనున్నారు. పర్యటించే ప్రాంతాలను కేంద్ర రిజర్వు పోలీస్ బలగాలు తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్నైపర్ టీమ్స్ జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి.
స్పెషల్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బస్టాండ్, రైల్వే స్టేషన్, కల్వర్ట్స్, హోటల్స్, రెస్టారెంట్స్లో చెకింగ్ నిర్వహించారు. అమిత్షా పర్యటించే మార్గాలకు ఇరువైపులా ఇండ్లలో కూడా తనిఖీలు చేశారు. నగరానికి 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉదయం 11 గంటల నుంచి అమిత్షా వెళ్లేదాకా నిషేదాజ్ఞలు అమలు చేయనున్నారు. సిటీలోకి ఎంటరయ్యే ట్రాఫిక్ను మూడు వైపులా డైవర్ట్ చేశారు. కొత్త వ్యక్తులు ఎవరికీ ఆశ్రయం ఇవ్వొద్దని సీపీ సాయిచైతన్య మీడియాకు రిలీజ్ చేసిన ప్రకటనలో కోరారు. షా బందోబస్తు కోసం ఎనిమిది జిల్లాల నుంచి 1,300 మంది స్పెషల్ పోలీసులను ఏర్పాటు చేశారు. సీసీ, డ్రోన్ కెమెరాలు, బైనాక్యూలర్లతో నిఘా పెడుతామని పోలీస్ అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ల్యాండ్
సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్షా నిజామాబాద్ నగరానికి మధ్యాహ్నం 2 గంటల టైంలో బీఎస్ఎఫ్ హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్లో బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి ఛాపర్లో కలెక్టరేట్లోని హెలిపాడ్లో ల్యాండ్ అవుతారు.
ఆర్యానగర్లోని జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ఓపెనింగ్ చేసి, బస్వాగార్డెన్లో ఆఫీసర్లతో భేటీ అవుతారు. ఎంపీ అర్వింద్ తండ్రి శ్రీనివాస్ ప్రథమ వర్థంతి సందర్భంగా నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్ వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించి మధ్యాహ్నం 3 గంటలకు పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించి తిరుగు ప్రయాణమవుతారు.