అమిత్షా పర్యటనకు భారీ బందోబస్తు..సీఆర్పీఎఫ్తో పాటు 8 జిల్లాల పోలీసులు

అమిత్షా పర్యటనకు భారీ బందోబస్తు..సీఆర్పీఎఫ్తో పాటు 8 జిల్లాల పోలీసులు
  • నిషేదాజ్ఞలు.. ట్రాఫిక్ నియంత్రణ 

నిజామాబాద్, వెలుగు: జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభించేందుకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్​షా  ఇందూర్​ సిటీకి రానున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జెడ్​ ప్లస్​ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న ఆయన నగరంలో ఉన్నంతసేపు నిఘా నీడలో పర్యటించనున్నారు. పర్యటించే ప్రాంతాలను కేంద్ర రిజర్వు పోలీస్ బలగాలు తమ కంట్రోల్​లోకి తీసుకున్నాయి. ఆక్టోపస్​, గ్రేహౌండ్స్​, స్నైపర్ టీమ్స్ జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి.

స్పెషల్​ టీమ్స్​, డాగ్ స్క్వాడ్​ బస్టాండ్, రైల్వే స్టేషన్, కల్వర్ట్స్, హోటల్స్, రెస్టారెంట్స్​లో చెకింగ్​ నిర్వహించారు. అమిత్​షా పర్యటించే మార్గాలకు ఇరువైపులా ఇండ్లలో కూడా తనిఖీలు చేశారు. నగరానికి 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉదయం 11 గంటల నుంచి అమిత్​షా వెళ్లేదాకా నిషేదాజ్ఞలు అమలు చేయనున్నారు. సిటీలోకి ఎంటరయ్యే ట్రాఫిక్​ను మూడు వైపులా డైవర్ట్ చేశారు. కొత్త వ్యక్తులు ఎవరికీ ఆశ్రయం ఇవ్వొద్దని సీపీ సాయిచైతన్య మీడియాకు రిలీజ్ చేసిన ప్రకటనలో కోరారు. షా బందోబస్తు కోసం ఎనిమిది జిల్లాల నుంచి 1,300 మంది స్పెషల్​ పోలీసులను ఏర్పాటు చేశారు. సీసీ,  డ్రోన్​ కెమెరాలు, బైనాక్యూలర్లతో నిఘా పెడుతామని పోలీస్​ అధికారులు తెలిపారు. 

మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ల్యాండ్​

సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్​షా నిజామాబాద్ నగరానికి మధ్యాహ్నం 2 గంటల టైంలో బీఎస్​ఎఫ్ హెలికాప్టర్​ ద్వారా చేరుకోనున్నారు. గుజరాత్​లోని అహ్మదాబాద్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్​లో బయలుదేరి బేగంపేట ఎయిర్​పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి ఛాపర్​లో కలెక్టరేట్​లోని హెలిపాడ్​లో ల్యాండ్​ అవుతారు.

ఆర్యానగర్​లోని జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ఓపెనింగ్​ చేసి, బస్వాగార్డెన్​లో ఆఫీసర్లతో భేటీ అవుతారు. ఎంపీ అర్వింద్​ తండ్రి   శ్రీనివాస్​ ప్రథమ వర్థంతి సందర్భంగా నగరంలోని కంఠేశ్వర్​ బైపాస్ రోడ్ వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించి మధ్యాహ్నం 3 గంటలకు పాలిటెక్నిక్​ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించి తిరుగు ప్రయాణమవుతారు.