- రూ.89 కి అమ్మేసిన బీర్ల తయారీ కంపెనీ
న్యూఢిల్లీ: ఏడు బ్రీవరీస్ ప్లాంట్లు, 1,800 మంది ఉద్యోగులను కేవలం ఒక యూరో (రూ.89) కి బీర్ల తయారీ కంపెనీ హైనెకెన్ అమ్మేసింది. ఇది కంపెనీ అమ్మే బీర్ ధర కంటే తక్కువ. తన రష్యా బిజినెస్ను అమ్మాలని ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్న ఈ డచ్ కంపెనీ తాజాగా ఆర్నెస్ట్ గ్రూప్తో డీల్ పూర్తి చేసింది. అన్ని రకాల అప్రూవల్స్ వచ్చాయని, 324.8 మిలియన్ డాలర్ల లాస్తో ఎగ్జిట్ అవుతున్నామని హైనెకెన్ వెల్లడించింది. ‘రష్యా నుంచి ఎగ్జిట్ అవ్వడానికి 2022 మార్చిలో ప్రాసెస్ స్టార్టయ్యింది.
ఈ ప్రాసెస్ పూర్తి చేయడానికి అవసరమైన అన్ని రకాల అనుమతులు వచ్చాయి. 300 మిలియన్ యూరోలు (320 మిలియన్ డాలర్ల) లాస్ వస్తుంది’ అని కంపెనీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఉక్రెయిన్పై దాడులు చేయడంతో రష్యా నుంచి ఎగ్జిట్ అవ్వాలని కంపెనీ నిర్ణయించుకుంది. కానీ, బయ్యర్ దొరకకపోవడంతో ప్రాసెస్ లేటయ్యింది. రష్యా నుంచి ఎగ్జిట్ అవ్వాలని చూస్తున్న మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఇబ్బందిపడుతున్నాయని హైనెకెన్ సీఈఓ డాల్ఫ్ వాన్ డెన్ బ్రింక్ అన్నారు. చాలా ఎంఎన్సీ కంపెనీలు రష్యా నుంచి ఎగ్జిట్ అవ్వాలని నిర్ణయించుకున్నాయి. కానీ, వీటి ఆస్తులను అక్కడి ప్రభుత్వం సీజ్ చేస్తోంది. ఆమ్స్టెల్ బ్రాండ్ మాన్యుఫాక్చరింగ్ వచ్చే ఆరు నెలల్లో ఆగిపోతుందని కంపెనీ పేర్కొంది.