
వాషింగ్టన్:ఇండియాలో ఆక్సిజన్ సప్లై చైన్ను విస్తరించేందుకు సహకారం అందిస్తామని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సర్కార్ హామీ ఇచ్చింది. కరోనాపై పోరాటంలో ఇండియాకు అన్ని రకాలుగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గురువారం యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవవలప్ మెంట్(యూఎస్ఏఐడీ) సీనియర్ అడ్వైజర్ జెరెమీ కోనిండిక్ వెల్లడించారు. ఇండియాలో హాస్పిటల్స్ పై తీవ్ర భారం పడుతోందని, ఆక్సిజన్, మందుల కొరతను వెంటనే తీర్చాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఇది అతిపెద్ద సవాలుగా మారిందన్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, జనరేటర్లు, సిలిండర్లు, పీపీఈ కిట్ల వంటివి వెంటనే అందజేయడం ద్వారా సమస్య పరిష్కారానికి సాయం చేస్తామన్నారు. ప్రధానంగా ఇండియాలో ఆక్సిజన్ సప్లై చైన్ను మెరుగుపర్చేందుకు టెక్నికల్ సహకారం అందిస్తామన్నారు. నిరుడు ఇండియా తమకు సహాయం చేసిందని, ఇప్పుడు తాము తిరిగి సహాయం చేస్తున్నామని తెలిపారు. ఇండియాకు ఎక్స్ పర్టుల టీంను కూడా పంపుతున్నామని చెప్పారు.
ఇండియాకు సాయం చేస్తం: జిన్పింగ్
కరోనాపై పోరాటంలో ఇండియాకు సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రకటించారు. కరోనాను కట్టడి చేసేందుకు సాయం చేస్తామని వెల్లడించారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి జిన్ పింగ్ లెటర్ రాశారు. గురువారం చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. కరోనాను నియంత్రించే మెటీరియల్స్ ఇండియాకు వేగంగా చేరుతున్నాయని చెప్పారు. విదేశాంగ మంత్రి జైశంకర్కు లెటర్ రాసిన ఆయన.. ఇండియాకు చైనా సానుభూతిని తెలియజేస్తోందని చెప్పారు. ఇండియా త్వరలోనే కరోనాను జయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, బెల్జియం, రొమేనియా, లక్సెంబర్గ్, సింగపూర్, పోర్చుగల్, స్వీడన్, న్యూజిలాండ్, కువైట్, మారిషస్ దేశాలు కూడా ఇండియాకు అత్యవసర మెడికల్ ఎక్విప్ మెంట్లను పంపుతున్నాయి. 300 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, 300 వెంటిలేటర్లు పంపుతామని జపాన్ ప్రకటించింది.