- ఎవర్గ్రీన్ను పక్కకు తప్పించేందుకు 2 టగ్బోట్లు
- ప్రయత్నాలు బెడిసికొడితే సరుకు అన్లోడింగ్
సూయజ్: సూయజ్ కాల్వలో అడ్డంగా ఇరుక్కుపోయిన ఎవర్ గ్రీన్ (ఎవర్గివెన్) నౌకను పక్కకు తప్పించేందుకు నెదర్లాండ్స్, ఇటలీ రంగంలోకి దిగాయి. ఇప్పటికే అక్కడ కొన్ని టగ్బోట్లు.. ఎవర్గ్రీన్ను పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా, వాటికి తోడుగా ఆ రెండు దేశాలు రెండు టగ్బోట్లను అక్కడకు పంపించాయి. సూయజ్ కెనాల్లో ఎవర్గ్రీన్ షిప్పు మంగళవారం చిక్కుకుపోవడంతో వేల కోట్ల రూపాయల వ్యాపారం నిలిచిపోయింది. ఆసియా దేశాల నుంచి యూరప్కు, యూరప్ దేశాల నుంచి ఆసియాకు సరుకు రవాణాపై తీవ్రంగా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే వీలైనంత తొందరగా షిప్పును పక్కకు తీసే పనిలో పడ్డారు. షిప్పును పక్కకు లాగడం, షిప్పు అడుగు భాగంలోని ఇసుకను తొలగించడం ద్వారా ఎవర్గ్రీన్ను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆదివారం కొంచెం గాలులు పెరగడం, అలల వేగం కూడా ఎక్కువగా ఉండడంతో తొందరగానే షిప్పును తొలగించేందుకు అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. ఒకవేళ ఈ ప్రయత్నమూ ఫెయిలైతే షిప్పులోని కొంచెం సరుకును కిందకు దించేసి.. పక్కకు లాగి చూడనున్నట్టు సూయజ్ కెనాల్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అదే జరిగితే.. షిప్పును తప్పించేందుకు మరికొన్ని రోజులు టైం పట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ఇక, సూయజ్ మార్గానికి దూరంగా ఉంటున్నాయి కొన్ని షిప్పింగ్ కంపెనీలు. వేరే మార్గాల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. షిప్ ఎప్పుడు పక్కకు తొలుగుతుందో తెలియని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నాయి.