- ప్రీమియం బైక్ సెగ్మెంట్పై నజర్
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ ఈ ఆర్థిక సంవత్సరంలో భారీసంఖ్యలో మోడల్స్ను లాంచ్ చేయనుంది. ప్రత్యేకించి ప్రీమియం బైక్ సెగ్మెంట్లో మార్కెట్ వాటాను పెంచుకుంటామని కంపెనీ సీఈఓ నిరంజన్ గుప్తా చెప్పారు. దేశంలోని అతిపెద్ద టూవీలర్మేకర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హీరో మోటోకార్ప్–హార్లీ డేవిడ్సన్ పార్ట్నర్షిప్ కింద మొదటి ప్రొడక్టును మార్కెట్కు పరిచయం చేయనుంది. దీంతోపాటు మరికొన్ని కొత్త బైక్లను తేనుంది. ఈ కంపెనీ బడ్జెట్ బైక్ సెగ్మెంట్ (100–110సీసీ)లో మార్కెట్ లీడర్ కాగా, 125 సీసీ సెగ్మెంట్లోనూ విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. 160–సీసీ..ఆపైన ఇంజన్ కెపాసిటీ గల మోడల్స్నూ తయారు చేస్తోంది.
" ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి క్వార్టర్లోనూ ఒక కొత్త బైక్ను లాంచ్ చేస్తాం. కంపెనీ చరిత్రలో ఇప్పటివరకు చూడనన్ని లాంచ్లు ఉంటాయి. ఈ ఏడాది వృద్ధి అవకాశాలపై కంపెనీ బుల్లిష్గా ఉంది. అన్ని సెగ్మెంట్లలో తన మార్కెట్ వాటాను మరింత పెంచుకుంటుంది మార్జిన్ రికవరీని పెంచుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం” అని గుప్తా వెల్లడించారు. 150సీసీ–450సీసీ ప్రీమియం సెగ్మెంట్ బైక్లపై కంపెనీ దృష్టి సారిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో 100 నగరాలకు ఎలక్ట్రిక్ బైక్ విదాను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగుతోందని, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది మన ఎకానమీయేనని గుప్తా స్పష్టం చేశారు. హీరో మోటోకార్ప్కు ప్రస్తుతం మొత్తం మోటార్ సైకిల్ విభాగంలో 51 శాతం మార్కెట్ ఉంది. పోయిన ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో 125 సీసీ సెగ్మెంట్లో మార్కెట్ వాటా వార్షికంగా14 శాతం నుండి 22 శాతానికి పెరిగింది.