- ఆలిండియా లెవెల్లో 15 శాతం ఉంది కదా?
- ఏపీకి చెందిన పిటిషనర్ను ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు : మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఏపీ స్టూడెంట్ల కోసం ఆలిండియా లెవెల్లో 15 శాతం సీట్లు కేటాయించాక.. కాంపిటేటివ్ అథారిటీ కోటా కింద 15 శాతం సీట్లు ఎందుకు రిజర్వు చేయాలని హైకోర్టు ఏపీకి చెందిన పిటిషనర్ను ప్రశ్నించింది. రాష్ట్రంలో 2004 తరువాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని వంద శాతం సీట్లను (ఆలిండియా కోటా 15 శాతం పోను) తెలంగాణ స్టూడెంట్స్కు కేటాయిస్తూ స్టేట్ గవర్నమెంట్ ఈ నెల 3న జీవో 72ను జారీ చేసింది. దీనిని ఏపీలోని విజయవాడకు చెందిన పి సాయి సిరిలోచన సహా ఇద్దరు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను బుధవారం జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ నామారపు రాజేశ్వరరావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. తొలుత పిటిషనర్ లాయర్ వాదిస్తూ, రాష్ట్ర విభజన సందర్భంగా మెడికల్ సీట్లలో రెండు రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాల నిమిత్తం 15 శాతం సీట్లను రిజర్వు చేసినట్లు చెప్పారు.
దీనిపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కల్పించుకుని.. 2014 నాటికి ఉన్న కాలేజీలకే ఆ నిబంధన అమల్లో ఉందని, 2014 తర్వాత ఏర్పాటైన కాలేజీలకు వర్తించదని చెప్పారు. అందుకే జీవో 72 ద్వారా ఆలిండియా లెవెల్లో 15 శాతం కాంపిటేటివ్ అథారిటీ కోటా భర్తీ పోను మిగిలిన సీట్లు మొత్తం తెలంగాణ స్టూడెంట్స్కే వర్తిస్తాయని వివరించారు. సమయం ఇస్తే సమగ్ర వివరాలతో కౌంటర్ వేస్తామని చెప్పడంతో హైకోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే, పిటిషనర్లను కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ చేసుకోడానికి అనుమతించాలని, అయితే, తాము చెప్పే తుది తీర్పునకు లోబడి ఆ అడ్మిషన్లు ఉంటాయని షరతు విధించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.