
హైదరాబాద్, వెలుగు: చేప పిల్లలు, రొయ్యలు పంపిణీ చేసిన వారికి 2 వారాల్లో డబ్బులు చెల్లించాలంటూ మత్స్యశాఖకు హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బిల్లులు చెల్లించి గత ఉత్తర్వుల అమలు నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. బిల్లులు చెల్లించాలంటూ డిసెంబర్లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో చేప, రొయ్య పిల్లల పంపిణీదారులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లను బుధవారం జస్టిస్ ఎన్వీ. శ్రవణ్ కుమార్ విచారించారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సాంకేతిక కారణాలతో బిల్లులు చెల్లించకలేకపోయామన్నారు. ప్రస్తుతం రూ.27 కోట్ల బడ్జెట్ మంజూరైందని, త్వరలో బిల్లుల చెల్లిస్తామని చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వినిపిస్తూ.. పిటిషనర్లకు బిల్లులు విడుదల చేస్తే చాలని కోర్టు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలను విన్న జడ్జి.. 2 వారాల్లో బిల్లులు చెల్లించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పశుసంవర్ధక, మత్స్యశాఖ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి ఘోష్, మత్స్యశాఖ కమిషనర్ ప్రియాంక ఆలా.. ఆన్లైన్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. నాగర్కర్నూల్ కలెక్టర్ బి.సంతోష్, ఫిషరీస్ డైరెక్టర్ శ్రీనివాస్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి.. హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా జడ్జి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.