పరిహారం చెక్కులు మేమిస్తం

పరిహారం చెక్కులు మేమిస్తం

రైతులు తీసుకోవడం లేదన్న ప్రభుత్వ వివరణపై హైకోర్టు

మల్లన్నసాగర్​ ముంపు రైతులకు సంబంధించిన చెక్కులను తమ వద్దకు తీసుకురావాలని, వాటిని రైతులకు అందజేసే ప్రయత్నం చేస్తామని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు భూసేకరణ పిటిషన్లపై విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. మల్లన్నసాగర్‌‌  రిజర్వాయర్ కట్టేందుకు సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌‌లో చేసిన భూసేకరణకు సంబంధించి రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టు చీఫ్​ జస్టిస్​ ఆర్ఎస్​ చౌహాన్, జస్టిస్​ షమీమ్​ అక్తర్​లతో కూడిన బెంచ్​విచారించింది.

భూసేకరణ నోటిఫికేషన్‌‌ను తప్పుపడుతూ రెండేళ్ల కిందటే రైతులు అభ్యంతరం చెప్పారని, అయినా జిల్లా కలెక్టర్‌‌ నోటిఫికేషన్‌‌ అవార్డు ఇచ్చేయడం చెల్లదని పిటిషనర్ల తరఫు లాయర్‌‌ వాదించారు. అయితే తాము సరైన పరిహారమే నిర్ణయించామని ప్రభుత్వం తరఫు లాయర్​ కోర్టుకు వివరించారు. రైతులకు డబుల్​ బెడ్రూం ఇల్లుగానీ, అది వద్దంటే రూ.5 లక్షలుగానీ ఇస్తున్నామని, భూములకు సంబంధించిన పరిహారం చెక్కులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కానీ రైతులు వాటిని తీసుకోవడం లేదన్నారు. దీనిపై స్పందించిన బెంచ్.. ఆ చెక్కులను హైకోర్టుకు తీసుకురావాలని, తాము రైతులకు అందజేసే ప్రయత్నం చేస్తామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.