
- కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: స్వాతంత్య్ర దినోత్సవం, శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ నేపథ్యంలో మాంసం దుకాణాలు, పశు కబేళాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ, అప్పటిలోగా జీహెచ్ఎంసీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ లా స్టూడెంట్ వడ్ల శ్రీకాంత్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి గురువారం విచారణ చేపట్టారు.
ఎటువంటి అధికారం లేకపోయినప్పటికీ జీహెచ్ఎంసీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషనర్ కోర్టును అడ్వొకేట్ కోరారు. జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది వాదిస్తూ..పిటిషనర్ మాంసం విక్రయం చేయరు కాబట్టి పిటిషన్ దాఖలుకు అర్హత లేదన్నారు. స్పందించిన కోర్టు.. జీహెచ్ఎంసీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.