
హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్ పై వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కామారెడ్డి జల్లా బిచ్కుంద మండలంలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతున్నదని, గ్రానైట్ క్వారీ వల్ల కాలుష్యం వెలువడుతోందంటూ కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. ప్రకాశ్ రాసిన లేఖను హైకోర్టు పిల్ గా స్వీకరించింది. దీనిని సోమవారం జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. భూగర్భ, గనుల శాఖ, రెవెన్యూ, హోం, రవాణా శాఖల ముఖ్య కార్యదర్శులు, గనుల శాఖ ఎండీ, సహాయ డైరెక్టర్, కామారెడ్డి కలెక్టర్, ఎస్పీ, బిచ్చుకుంద తహసీల్దార్లకు నోటీసులు ఇచ్చింది.
గ్రానైట్ కాలుష్యంపై ఏం చర్యలు తీసుకున్నారు?
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం అసిఫ్నగర్ లో గ్రానైట్ క్వారీ మైనింగ్ వల్ల పరిసరాలు కాలుష్యమయంగా మారుతున్నాయని దాఖలైన పిల్లో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కాలుష్య నివారణ చర్యలు తీసుకోని క్వారీలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సీజే అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. అసిఫ్నగర్లో గ్రానైట్ క్వారీలతో పరిసరాల కాలుష్యంపై డాక్టర్ అరుణ్కుమార్ రాసిన లెటర్ను హైకోర్టు పిల్గా తీసుకుంది. ప్రతివాదులుగా చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కలెక్టర్, గనుల శాఖ సహాయ డైరెక్టర్, పర్యావరణ ఇంజినీరు, కొత్తపల్లి తహసీల్దార్లను చేర్చారు.