తాండూరు మున్సిపల్, రెవెన్యూ అధికారులను ఆదేశించిన హైకోర్టు

తాండూరు మున్సిపల్, రెవెన్యూ అధికారులను ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు వ్యక్తుల భూముల్లో జోక్యం చేసుకోవద్దని వికారాబాద్‌‌ జిల్లా తాండూరు మున్సిపాలిటీతో పాటు రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. పూర్వీకుల నుంచి వచ్చిన తమ భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడాన్ని సవాలు చేస్తూ పి. బస్వరాజ్‌‌ తో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. దీనిపై సోమవారం జస్టిస్‌‌ కె. లక్ష్మణ్‌‌ విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌‌ తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టు ఇంజంక్షన్‌‌ ఉత్తర్వులు జారీ చేసినా అధికారులు భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పిటిషనర్లకు చెందిన భూమిని ప్రభుత్వ భూమిగా తహసీల్దార్​ ఆదేశాలు జారీ చేశారని, దాని ఆధారంగా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. 

వాదనలను విన్న జడ్జి.. తహసీల్దార్ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.