
- ఏటా పెరుగుతున్న బీ కేటగిరీ సీట్లు
- 2022లో 20 వేలు నిండితే.. 2024లో 28 వేలకు పెరిగింది
- 20 వేల ర్యాంక్ దాటితే సీఎస్ఈ సీటు కోసం మేనేజ్మెంట్ కోటా వైపు పేరెంట్స్ చూపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లకు ఫుల్ డిమాండ్ ఉంది. టాప్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) సీటు కోసం ఎంత ఫీజు అయినా చెల్లించేందుకు పేరెంట్స్ రెడీ అవుతున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా సీట్లు లేకపోవడంతో, మేనేజ్మెంట్లు దీన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. అయితే, కొన్ని కాలేజీల్లో ఫీజు కట్టినా, మంచి ర్యాంకు లేకుంటే సీటు లభించే పరిస్థితులు కన్పించడం లేదు.
మేనేజ్మెంట్ కోటాలో కేవలం కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల సీట్లకే పోటీ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1.18 లక్షల సీట్లున్నాయి. దీంట్లో 60 శాతానికిపైగా కంప్యూటర్ సైన్స్ దాని అనుంబంధ కోర్సులవే. అయితే, గతేడాది మొత్తం 1,07,160 సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటాలో 79,224, మేనేజ్మెంట్ కోటాలో 27,936 సీట్లు నిండాయి. స్టేట్లో 175 కాలేజీలు ఉన్నా..15, 20 కాలేజీల్లోని సీట్లకే డిమాండ్ ఉంది. దీంతో ఆయా కాలేజీలు ఫీజులను భారీగా డిసైడ్ చేస్తున్నాయి.
బీ కేటగిరీ సీట్లకు డిమాండ్
రాష్ట్రంలో ఇంజినీరింగ్సీట్ల భర్తీలో బీ కేటగిరి (మేనేజ్మెంట్ కోటా) సీట్ల వాటా ఏటా పెరుగుతోంది. మొత్తం సీట్లలో 30శాతం మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేసుకునే చాన్స్ ఉంది. ఈఏపీసెట్లో ర్యాంక్ ఆధారంగా కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద సీట్లను నింపుతున్నారు. అయితే, ఈఏపీసెట్లో 20వేల ర్యాంక్ దాటితే, టాప్ కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం లేదు. కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సుల్లో 15 వేలలోపు ఉంటేనే కాస్త చాన్స్ ఉంది.
సీఎస్ఈ వంటి హాట్ కోర్సులు చేయాలనుకునేవారు మంచి కాలేజీల్లో సీటు పొందడం కష్టంగా మారింది. దీంతో, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడడం లేదు. ఈ కారణంతోనే మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం లక్షలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో సీఎస్ఈ అనుబంధ కోర్సుల్లోని సీట్లు టాప్ కాలేజీలలో రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముతున్నట్టు తెలుస్తోంది. సెంకడరీ కాలేజీల్లోనూ రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల దాకా తీసుకుంటున్నారు.
పెరుగుతున్న అడ్మిషన్లు..
మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. 2022లో దాదాపు 20,238 మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ కాగా.. 2023లో 22,103 నిండాయి. గతేడాది 2024లో ఆ సంఖ్య దాదాపు 28 వేలకు చేరుకుంది. కేవలం రెండు సంవత్సరాల్లో 8 వేల సీట్లు పెరిగాయి. ఇది రాష్ట్రంలో ఇంజినీరింగ్ చదువుల పట్ల పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తున్నాయని విద్యావేత్తలు చెప్తున్నారు. అయితే, ఈ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు సీట్లను అడ్డగోలుగా అమ్ముకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భర్తీ అయ్యే వాటిలో 90శాతం సీట్లు కంప్యూటర్ సైన్స్వే కావడం గమనార్హం.