
- ..మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ షేక్పేట్లోని నందగిరిహిల్స్లో నెట్ నెట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన నిర్మాణాలపై దర్యాప్తు చేసి 2 నెలల్లో రిపోర్టు ఇవ్వాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమ్రపాలి వివరణ కూడా తీసుకోవాలని సూచించింది. అప్పటి దాకా నిర్మాణాలపై స్టేటస్కో ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
సిటీ స్మాల్ కాజెస్ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా పరిగణనలో తీసుకుంటామని చెప్పింది. నిర్మాణాలకు ఫైర్, ఎయిర్పోర్ట్ అథారిటీల నుంచి ఎన్వోసీలు లేకుండా నెట్ నెట్ వెంచర్ నిర్మాణాలు చేపడ్తున్నదనే పిటిషన్పై బుధవారం జస్టిస్ లక్ష్మణ్ విచారించారు. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని నందగిరిహిల్స్లో జి.అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని నెట్ నెట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 12 అంతస్తుల మల్టీ సోరెడ్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నది.
ఇందుకు 2013లో జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నది. తర్వాత ఫ్లోర్ల సంఖ్య పెంచింది. జీ ప్లస్ 13 నిర్మాణం 2,09,620 చదరపు అడుగుల నిర్మాణాలకు చర్యలు చేపట్టింది. ఇందులో సెవెన్ స్టార్ హోటల్, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్ నిర్మించాలనేది నెట్ నెట్ వెంచర్ ప్రతిపాదన. నెట్ నెట్ వెంచర్ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పర్యావరణ నిబంధనలకు విరుద్ధమంటూ నందగిరి కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విజిలెన్స్ శాఖ నివేదిక ఇచ్చింది. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించి అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నందున ఆ నిర్మాణాలను తొలగించాలని జనవరిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని నందగిరి కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ హైకోర్టును కోరింది.