చిరంజీవి అప్లికేషన్‌‌పై చర్యలు తీసుకోండి..జీహెచ్‌‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

చిరంజీవి అప్లికేషన్‌‌పై చర్యలు తీసుకోండి..జీహెచ్‌‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌‌ ఇంటి పునరుద్ధరణ పనులను క్రమబద్ధీకరించాలని నటుడు చిరంజీవి పెట్టుకున్న అప్లికేషన్‌‌ను చట్టప్రకారం నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్‌‌ఎంసీని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఇంటి పునరుద్ధరణలో భాగంగా రిటైన్‌‌ వాల్‌‌ నిర్మాణం చేశామని, దీని క్రమబద్ధీకరణకు జూన్‌‌ 5న దరఖాస్తు చేసుకోగా జీహెచ్‌‌ఎంసీ వద్ద పెండింగ్‌‌లో ఉందని చర్యలు తీసుకునేలా ఆర్డర్‌‌ ఇవ్వాలని హీరో చిరంజీవి పిటిషన్‌‌ వేశారు. 

దీనిని న్యాయమూర్తి జస్టిస్‌‌ బి. విజయ్‌‌సేన్‌‌రెడ్డి ఇటీవల విచారణ పూర్తి చేసి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు. 2002లో గ్రౌండ్, మరో రెండంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని నిర్మించాక పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్టు న్యాయవాది వివరించారు. దీనిపై జీహెచ్‌‌ఎంసీ న్యాయవాది స్పందిస్తూ.. చట్టప్రకారం దరఖాస్తుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పిటిషనర్‌‌ దరఖాస్తును నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్‌‌ఎంసీని ఆదేశించిన న్యాయమూర్తి పిటిషన్‌‌పై విచారణను మూసివేసినట్టు ప్రకటించారు.