హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లలో టాయిలెట్స్ వినియోగించే విధంగా ఉన్నాయో, లేవో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలోగా చీఫ్ సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్లు కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని 20 శాతం స్కూళ్లల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవని.. బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల ఒక పత్రికలో పబ్లిషైన న్యూస్ ఐటెమ్ను హైకోర్టు పిల్గా పరిగణలోకి తీసుకుంది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి బెంచ్ మంగళవారం విచారించింది. స్కూళ్లలో టాయిలెట్స్ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కోర్టు..విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.