
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీని కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు సందర్శించినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ తో వీడియోలు తీశారనే కేసులో హైకోర్టు స్టే విధించింది. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, బాల్క సుమన్పై మహదేవ్పూర్ పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే దాకా విచారణ చేయొద్దని ఆదేశించింది.
పిటిషనర్లను అరెస్టు కూడా చేయరాదని చెప్పింది. డ్రోన్ కెమెరాతో వీడియోలు తీస్తే ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందనే అభియోగాలకు పొంతన లేదని, దీనిపై లోతుగా విచారణ చేస్తామని జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం వెల్లడించారు. కాగా, జులై 29న కేటీఆర్, గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్, పార్టీ నేతలతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్యారేజీపై డ్రోన్ ఎగురవేశారంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షేక్ వలీ.. మహదేపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ కేటీఆర్, రమణారెడ్డి, బాల్క సుమన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడంతో వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తమ క్లయింట్లు మేడిగడ్డను సందర్శించారని కేటీఆర్ తరఫు అడ్వకేట్ టీవీ రామారావు కోర్టుకు తెలిపారు. డ్రోన్ కెమెరాతో మేడిగడ్డ రిజర్వాయర్ వీడియో తీస్తే బ్యారేజీకి ఎలా నష్టం వాటిల్లుతుందో పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించలేదన్నారు. వాదనలు విన్న జడ్జి.. కేసు దర్యాప్తుపై స్టే విధిస్తూ.. తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేశారు.