హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో బంజారాహిల్స్ విరించి ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు రోడ్డు విస్తరణ పనులకు జీహెచ్ఎంసీ జారీ చేసిన భూసేకరణ నోటీసుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.భూసేకరణ చట్టానికి విరుద్ధంగా నోటీసులు జారీ చేశారంటూ కె.విక్రమ్దేవ్ సహా 21 మంది దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు బుధవారం విచారించింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. విరించి ఆస్పత్రి నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు 100 అడుగులు, అగ్రసేన్ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ మార్గంలో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు 120 అడుగుల రోడ్డు విస్తరణకు సెక్షన్15(1) కింద నోటీసు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. కానీ ముందస్తు దశ అయిన సెక్షన్11(1) నోటీసు జారీ అయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు. వాదనలను విన్న న్యాయస్థానం..రోడ్డు విస్తరణకు భూములు సేకరించే ముందు భూయజమానులకు తప్పనిసరిగా నోటీసులు అందాలని తెలిపారు.
