
హైదరాబాద్, వెలుగు : సింగరేణిలో గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కావాలన్న ఆ సంస్థ మేనేజ్మెంట్ వినతిని హైకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు మేనేజ్మెంట్ వేసిన అఫిడవిట్ను కొట్టేస్తూ జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నాలుగేండ్లుగా గుర్తింపు సంఘం లేకపోవడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని సింగరేణి బొగ్గు గనుల కార్మిక సంఘం వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఎన్నికల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని యాజమాన్యాన్ని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను గర్తుచేసింది.
కార్మికుల యూనియన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ జి.విద్యాసాగార్ వాదనలను ఆమోదించింది. వరుస పండగలు, అసెంబ్లీ ఎన్నికల మీటింగ్స్ తదితర పనుల వల్ల ఎన్నికలను నిర్వహించలేకపోతున్నామని, అక్టోబర్లోగా ఎన్నికలు నిర్వహించాలన్న గత ఉత్తర్వులను వాయిదా వేయాలన్న సింగరేణి మేనేజ్మెంట్ అఫిడవిట్ను హైకోర్టు కొట్టేసింది. గత కొన్నేండ్లుగా ఎన్నికలను తప్పించుకోవడానికి యాజమాన్యం వివిధ కారణాలు చూపడాన్ని తప్పుబట్టింది. మరోవైపు, ఈ నెల 27న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులు సమక్షంలో సింగరేణి కార్మిక సంఘాలు, సింగరేణి యాజమాన్యం మధ్య చర్చలు జరగనున్నాయి.
ఇందులో ఎన్నికల నిర్వహణపై క్లారిటీ రానుంది. రాష్ట్ర సర్కార్ సహకరించి ఎన్నికల నిర్వహణకు రెవెన్యూ ఉద్యోగులు, భద్రతా సిబ్బందిని నియమిస్తే ముందు ప్రకటించిన విధంగా అక్టోబర్ 28న ఎన్నికలు జరిగే చాన్స్ ఉంటుంది. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో అక్టోబర్ నెలలోపు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ, బీఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్లు వాసిరెడ్డి సీతారామయ్య, యాదగిరి సత్తయ్య డిమాండ్చేశారు.