ఎమ్మెల్యే రాజాసింగ్కు హైకోర్టులో ఊరట లభించింది. రాజాసింగ్ రిమాండ్ను గతంలో నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేసింది. అయితే నాంపల్లి కోర్టు తీర్పును సవాలు చేస్తూ మంగళ్ హాట్ పోలీసులు హైకోర్టు పిటిషన్ వేశారు. ఈ రివిజన్ అప్పీల్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. నాంపల్లి కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.
నాంపల్లి కోర్టు రిజెక్ట్
గత ఏడాది అగస్టు 23న ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్ ను నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం.. ఉద్రిక్తతలను నివారించేందుకు రిమాండుకు పంపాలన్న ప్రాసిక్యూషన్ వాదనలను కోర్టు ఏకీభవించలేదు. అరెస్ట్ సమయంలో 41 సీఆర్పీసీ,సుప్రీంకోర్ట్ నియమాలు పాటించలేదన్న వాదనలను గుర్తించింది. దీంతో రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఆ సమయంలో అరెస్టు చేసిన రాజాసింగ్ ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. రాజాసింగ్ బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో సుమారు 45 నిమిషాలపాటు వాదనలు జరిగాయి.
రాజాసింగ్ పై నమోదు చేసిన కేసులు
ఎమ్మెల్యే రాజాసింగ్ కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టారంటూ ఐపీసీ ( IPC) సెక్షన్ 153(A) కింద గతంలో కేసు నమోదు చేశారు. అలాగే మత విశ్వాసాలను కించపర్చినందుకు సెక్షన్ 295-A కింద కేసు.. ప్రకటనల ద్వారా నష్టం కలిగించినందుకు సెక్షన్ 295-A.. బెదిరింపులకు పాల్పడినందుకు సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇవన్నీ బెయిలబుల్ కేసులే నంటూ రాజాసింగ్ న్యాయవాది వాదించగా.. కోర్టు అంగీకరించి బెయిల్ మంజూరు చేసింది.