హైదరాబాద్, వెలుగు: స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) సరిగ్గా పనిచేయడం లేదని హైకోర్టు నిప్పులు చెరిగింది. పీసీబీపైనే అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయని, పబ్లిక్ ఇచ్చిన వినతిపత్రాలపై చర్యలు తీసుకోకపోవడంతో వారంతా కోర్టుకు వస్తున్నారని చెప్పింది. పీసీబీ సరిగా పనిచేయకపోతే దానిని మూయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని హెచ్చరించింది. సూర్యాపేటలో మైహోం ఇండస్ట్రీస్ విస్తరణకు అనుమతుల్లో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం పీసీబీ జులై 27న జారీచేసిన నోటీసులను సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన వెంకటేశ్వర్లుతో పాటు ఇతరులు సవాలు చేసిన పిల్స్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ల డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. అలాగే మరో ప్రైవేటు సంస్థకు మూసేస్తామని ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపైనా బెంచ్ విచారణ చేపట్టింది.
సీనియర్ అడ్వొకేట్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ.. మైహోం ఇండస్ట్రీస్ విస్తరణ నిమిత్తం దరఖాస్తులు చేసుకుందని తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం సిమెంట్, సున్నపురాయి గనుల లీజులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం జులై 27న పీసీబీ నోటీసులు జారీ చేసిందన్నారు. ఒకేసారి మూడుచోట్ల ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారని, వాటిని వేర్వేరు ప్రాజెక్టులుగా పరిగణించకూడదని చెప్పారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. మైహోం ఇండస్ట్రీస్ మూడు దరఖాస్తులు చేసుకుందని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మెమొరాండం ప్రకారం ఈ కేసులో వేర్వేరు ప్రజాభిప్రాయ సేకరణ సరికాదని పేర్కొంది.మూడింటిపైన ఒకేచోట ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచించింది. దీనిపై వివరాలు అందజేయాలని పీసీబీని ఆదేశించి విచారణను బెంచ్ వాయిదా వేసింది.