
- నేషనల్ హైవే 44పై ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు
తూప్రాన్, మనోహరాబాద్, వెలుగు: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి సమీపంలో 44 వ నెంబర్ నేషనల్ హైవే పై నిర్మిస్తున్న హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై ఆరేళ్లు గడుస్తున్నా ఇంతవరకు పూర్తికాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనోహరాబాద్ -కొత్తపల్లి రైల్వే లైన్ నేషనల్ హైవే 44 ను క్రాస్ చేయాల్సి ఉండడంతో రామాయిపల్లి వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని అధికారులు నిర్ణయించారు.
2018లో రూ.117 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి అదే ఏడాదిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. మొదట అండర్ పాస్ నిర్మాణం చేపట్టి రైల్వే లైన్ పూర్తి చేశారు. కానీ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణంలో మాత్రం ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నారు. ఏడాది కింద ఓ వైపు పనులు పూర్తి చేసి వాహనాలు వెళ్లేందుకు రోడ్డు క్లియర్ చేశారు. మరోవైపు పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షాకాలం వస్తే అంతే సంగతులు
హైవేపై బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో వర్షాకాలం వస్తే అండర్ పాస్ లో పెద్ద మొత్తంలో నీరు నిలిచి వాహనదారులు అవస్థ పడుతున్నారు. బ్రిడ్జి కింద అండర్ పాస్ లో నీరంతా చేరుతుండడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. హైదరాబాద్ నుంచి తూప్రాన్ వైపు వచ్చే దారిలో ఒక వైపు పనులు పూర్తయినప్పటికీ తూప్రాన్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో పనులు పూర్తి కాక వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.
పనులు వెంటనే పూర్తి చేయాలి
హైవే పై బ్రిడ్జి నిర్మాణ పనులు స్లోగా జరుగుతున్నాయి. వర్షాకాలం అండర్ పాస్ లో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతుంది. ఎమర్జెన్సీ సమయంలో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేషనల్ హైవే అధికారులు వెంటనే పనులను పూర్తి చేసి వాహనాదారుల ఇబ్బందిని తొలగించాలి.
వినయ్, తూప్రాన్
జులైలో పనులు పూర్తి చేస్తాం
కొన్ని ఇబ్బందుల వల్ల పనుల్లో ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. జులై పూర్తయ్యే లోపు బ్రిడ్జి పనులను పూర్తి చేసి వాహనదారులకు ఇబ్బందిలేకుండా చూస్తాం.
శ్రీనివాస్, నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్