
- జూనియర్ డాక్టర్ ఘటనను నిరసిస్తూ ర్యాలీ
- బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు
- రాళ్లు, ఇటుకలతో దాడి చేసిన స్టూడెంట్లు
- టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
- గాల్లో కాల్పులు.. పలువురు స్టూడెంట్ల అరెస్ట్
- ‘‘పశ్చిమబంగా ఛాత్ర సమాజ్’’ ఆధ్వర్యంలో నిరసన
- ఉద్రిక్తంగా మారిన ‘‘నబన్నా అభియాన్” ర్యాలీ
కోల్కతా:ట్రెయినీ డాక్టర్పై అత్యాచారం, హత్యను ఖండిస్తూ ‘పశ్చిమబంగా ఛాత్ర సమాజ్’ స్టూడెంట్ యూనియన్ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ‘నబన్నా అభియాన్’ పేరుతో కోల్కతాలో స్టూడెంట్లు మంగళవారం ఉదయం హౌరా నుంచి సెక్రటేరియెట్కు ర్యాలీగా బయలుదేరారు. వీరిని సంత్రాగచి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్టూడెంట్లు, పోలీసులకు మధ్య ఘర్షణ మొదలైంది. బారికేడ్లు తోసుకుంటూ స్టూడెంట్లు ముందుకెళ్లే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆగ్రహించిన స్టూడెంట్లు పోలీసులపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. దీంతో పోలీసులు వాటర్ కెనాన్లతో వారిని చెదరగొట్టారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు స్టూడెంట్లు, పోలీసులకు గాయాలయ్యాయి. ఎంజీ రోడ్, హాస్టింగ్ రోడ్, ప్రిన్సెప్ ఘాట్ దగ్గర్లో, హౌరా మైదాన్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలువురు స్టూడెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ‘పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్’ స్టూడెంట్ యూనియన్కు రాష్ట్ర ప్రభుత్వ అసమ్మతి ఉద్యోగుల వేదిక ‘‘సంగ్రామి జౌతమంచ” మద్దతు తెలిపింది.
పోలీసులే రెచ్చగొట్టారు
మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ స్టూడెంట్లు డిమాండ్ చేస్తున్నారు. కేసును పక్కదోవ పట్టించేందుకు ఆమె ప్రయత్నించారని ఆరోపించారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీలతో చితకబాదారని మండిపడ్డారు. చట్టాన్ని తాము ఉల్లంఘించలేదన్నారు. లాఠీచార్జ్కు మమతా బెనర్జీనే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రెయినీ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని వెంటనే ఉరి తీయాలన్నారు.
రాళ్లు రువ్వడంతోనే టియర్ గ్యాస్ ప్రయోగం
బారికేడ్లు తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేయడంతోనే లాఠీచార్జ్ చేశామని పోలీసులు చెప్తున్నారు. కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారని తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్ కెనాన్, టియర్ గ్యాస్ ప్రయోగించామన్నారు. వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించినా నిరసనకారులు పట్టించుకోలేదన్నారు.
కోల్కతా సిటీ సీపీ పేరు మీద నిందితుడి బైక్
ట్రెయినీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ వాడే బైక్ సిటీ పోలీస్ కమిషనర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది. దీంతో ఈ కేసులో పోలీసుల ప్రమేయంపై కూడా సీబీఐ విచారణ జరుపుతున్నది. ఇప్పటికే అతని బైక్ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. నిందితుడు సంజయ్ రాయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో సివిక్ వాలంటీర్ అని తెలిపారు. కోల్కతా పోలీసుల వాహనాలు అన్నీ సిటీ పోలీస్ కమిషనర్ పేరుతోనే అధికారికంగా రిజిస్టర్ అయి ఉంటాయని చెప్పారు.
నేడు బీజేపీ 12 గంటల స్ట్రైక్..
స్టూడెంట్ యూనియన్ నేతలపై పోలీసుల దాడిని ఖండిస్తూ బీజేపీ బుధవారం 12 గంటల పాటు జనరల్ స్ట్రైక్కు పిలుపునిచ్చింది. నిరసనల వెనుక బీజేపీ హస్తం ఉందని టీఎంసీ నేతలు చేస్తున్న కామెంట్లను ఖండించింది. స్టూడెంట్లపై లాఠీచార్జ్ చేయించిన మమతా బెనర్జీ తన సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బుధవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా స్ట్రైక్ చేస్తామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులను పోలీసులే రెచ్చగొట్టారని మండిపడ్డారు.
మాజీ ప్రిన్సిపాల్పై కేసు..
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన అవినీతిపై మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్తో పాటు మరికొందరిపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని అంశాలను పరిగణనలోకి తీసుకుని సందీప్ ఘోష్పై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ ఏ) కింద కేసు రిజిస్టర్ చేసింది. మెడికల్ కాలేజీతో పాటు హాస్పిటల్కు సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నది. త్వరలోనే అందరికీ సమన్లు జారీ చేసి విచారించే అవకాశాలున్నాయి. సీబీఐ ఎఫ్ఐఆర్లోని పేర్లనే ఈడీ తన కేసులోనూ పొందుపర్చింది.