బెంగళూరు : నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో డాక్టర్లు అత్యాధునిక చికిత్స అందిస్తున్నారు. తారకరత్నను చూసేందుకు ఆయన సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లారు. నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రికి వెళ్లారు.
బెంగళూరు చేరుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ నేరుగా నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మరోవైపు కర్ణాటక వైద్యశాఖ మంత్రి సుధాకర్ కూడా నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
తారకరత్న మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ కారణంగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారని.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో డాక్టర్లు వెల్లడించారు.