
‘‘హిట్ 3’చిత్రాన్ని వైలెన్స్ కోసం తీయలేదు. కథలోనే ఆర్గానిక్గా కుదిరింది”అని చెప్పాడు నాని. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు. నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. గురువారం(MAY1) సినిమా విడుదలవుతున్న సందర్భంగా నాని ఇలా ముచ్చటించాడు.
‘‘జెర్సీ, దసరా, హాయ్ నాన్న ఇప్పుడు హిట్ 3.. ఇలా ప్రతి సినిమాని ఒక కొత్త జానర్లో చేయాలని ప్రయత్నిస్తున్నా. ‘హిట్ 3’లో నేనే ఎందుకు హీరోగా నటించాననేది సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. ‘హిట్’ ఫ్రాంచైజీ లో వచ్చిన గత రెండు చిత్రాలు కూడా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్. ‘హిట్ 3’లోకి స్టోరీ డిమాండ్ను బట్టి వైలెన్స్ వచ్చింది. అదికూడా చాలా రిలేటబుల్, స్టైలిష్గా ఉంటుంది. వైలెన్స్ కోసం దీన్ని తీయలేదు. కథలోనే ఆర్గానిక్గా ఉంది. తెరపై చూస్తున్నప్పుడు అది డిస్ట్రబ్ చేసేలా ఉండదు. ఎంజాయ్ చేసేలానే ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమాలో హింస ఎలా ఉంటుందో ఇందులో కూడా అలాంటి వైలెన్సే ఉంటుంది.
ఇందులోని ప్రతి పాత్రకి ఒక పర్పస్ ఉంది . శ్రీనిధి చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. తను ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. అలాగే ఫీల్ గుడ్ సినిమాలు చేసే మిక్కీ జే మేయర్ థ్రిల్లర్కి వర్క్ చేస్తే కొత్తగా ఉంటుందని తీసుకున్నాం. తన బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక షాన్ గారి విజువల్స్ ఎమోషన్ని ఎన్హాన్స్ చేస్తాయి. చాలా మంచి ఎమోషనల్ హై ఉన్న సినిమా ఇది. ఇదొక ప్రామిస్ రిలేటెడ్ ఎమోషన్. కచ్చితంగా ఓ మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇటీవల ప్రేక్షకులు థియేటర్స్కి రావడం లేదని తరచుగా వింటున్నాం. కానీ మా మూవీ అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే ఆనందంగా ఉంది. మనం ఎక్సయిట్ చేసే కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్కి వస్తారని నా అభిప్రాయం. ఇక నా ప్రొడక్షన్లో చిరంజీవి గారి సినిమా అనేది నాకే ఇంకా డైజెస్ట్ అవడం లేదు. అదొక ప్రౌడ్ మూమెంట్’’.
పహల్గమ్లో షూట్ గురించి నాని చెబుతూ.. 'పహల్గమ్ డిఫరెంట్ లోకేషన్స్లో 18 రోజులు షూట్ చేశాం. ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన మమ్మల్ని కలిచివేసింది. అలాగే ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడే డీవోపీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి అనారోగ్య కారణాల వల్ల కోల్పోవడం జరిగింది. ఆ ఘటన కూడా మమ్మల్ని చాలా బాధించిందని నాని అన్నారు.
ఇకపోతే, హిట్ 3 షూటింగ్ టైంలో 30 ఏళ్ల మహిళా ఫొటోగ్రాఫర్ మృతి చెందిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ అండ్ శ్రీనగర్ లో పలు సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా యువ సినిమాటోగ్రాఫర్ కే ఆర్ క్రిష్ణ (KR Krishna) గుండెపోటుతో మరణించింది.