
గత ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘కాంతార’ సినిమా ఓ సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ఊహించని రీతిలో సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. రిషబ్శెట్టి(Rishab Shetty) నటించిన ‘కాంతార’ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించినట్లు హోంబలే ఫిల్మ్స్ తెలిపింది.
‘కాంతార సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైంది. ఆస్కార్ ఫైనల్లోనూ కాంతార సత్తా చాటాలని కోరుకుంటున్నాం’ అని ఈ సినిమాను ఆదరించిన వారికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది.
ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో మన దేశ చిత్రాలు సత్తా చాటాలని నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన ‘కాంతార’ చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోయింది.
ఆస్కార్ పురస్కారం కోసం నామినేషన్స్ బరిలో నిలిచిన సినిమాల తాజా జాబితాను ఆస్కార్స్ వెలువరించింది. ఇండియా నుంచి 10 సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. ఇండియా నుంచి అధికారికంగా ‘ది ఛల్లో షో’సినిమాను పంపారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘కశ్మీరీ ఫైల్స్’, ‘కాంతార’, ‘విక్రాంత్ రోణ’, ‘గంగూభాయి కతియావాడి’, ‘మి వసంతరావ్’, ‘తుజ్యా సాథీ కహీ హై’, ‘రాకెట్రీ’, ‘ఇరవిన్ నిళల్’ సినిమాలు ఓపెన్ కేటగిరిలో నిలిచాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 301 సినిమాలు అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి. 95వ ఆస్కార్ అవార్డ్స్కు నామినేట్ అయిన సినిమాలను ఈనెల 24న ప్రకటిస్తారు. మార్చి 12వ తేదీన ఆస్కార్ వేడుక జరగనుంది.