
అమరావతి: రేషన్ పై సరికొత్త విధానం తీసుకొచ్చింది ఏపీ సర్కార్. మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తే చాలు.. ఇక ఇంటికే రేషన్ సరుకులు చేరుతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా గ్రామ, వార్డు వాలంటీర్ల చేతుల్లోకి వెళ్లనుంది.. జనవరి 1వ తేదీ నుంచి వాళ్లే డైరెక్ట్ గా వాహనాల ద్వారా సరుకులను ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు.
5, 10, 15 కేజీల చొప్పున బియ్యం ప్యాకింగ్ చేసి, కార్డు ఉన్నవారి అర్హతను బట్టి పంపిణీ చేస్తారు. ఎంఎల్ఎస్పీ పాయింట్ నుంచి డైరెక్ట్ గా సరుకులు రేషణ్ దుకాణాలకు వస్తాయి. అక్కడి నుంచి సరుకులు తీసుకుని తమ పరిధిలోని ఇళ్లకు వాలంటీర్లు అందజేస్తారు. అయితే రేషన్ కార్డు యజమాని మొబైల్ నెంబర్ ను రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతినెల రేషన్ తీసుకునే సమయంలో మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ఆధారంగా.. సీరియల్ గా సరుకులను పంపిణీ చేస్తామని తెలిపారు అధికారులు.
దీంతో 2021 జనవరి నుంచి రేషన్ తీసుకోవాలంటే.. ప్రతి కార్డుదారునికి మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఉండాలి. సరుకులు అందజేసిన తర్వాత ఆ మొబైల్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వాలంటీర్లు తమ సర్వర్ లో నమోదు చేస్తేనే సంబంధిత కుటుంబానికి సరుకులు చేరుతాయన్నమాట.