మమత పార్టీ ఎంపీల తిరుగుబాటు : ప్రత్యేకంగా గుర్తించాలని స్పీకర్ కు లేఖ

మమత పార్టీ ఎంపీల తిరుగుబాటు : ప్రత్యేకంగా గుర్తించాలని స్పీకర్ కు లేఖ

పశ్చిమ బెంగాల్ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఏకంగా 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడంతో రాజకీయాల్లో పెద్ద దుమారం రేగుతోంది. ఈ ఎంపీలు అంతా కలిసి లోక్‌సభలో ఒక ప్రత్యేక గ్రూప్‌గా లేదా కొత్త కూటమిగా ఏర్పడాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సరిపడా ఎంపీల బలం మాకు ఉందని వారు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

మమతా బెనర్జీకి పెరుగుతున్న కష్టాలు
పార్టీలో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తుండటంతో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఒత్తిడిలో పడ్డారు. దీనికి తోడు, టీఎంసీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి రాజీనామా చేయడంతో పరిస్థితి మరింత చేయి దాటిపోయింది. ఈ పరిణామాల తర్వాత ఢిల్లీలో వరుస మీటింగులు, రాజకీయ వ్యూహాలు మొదలయ్యాయి.

ఢిల్లీలో సీక్రెట్ మీటింగులు.. బీజేపీ నేతలతో భేటీ 
 సమాచారం ప్రకారం.. మొదట 13 మంది టీఎంసీ లోక్‌సభ ఎంపీలు ఢిల్లీలో సుఖేందు శేఖర్ రాయ్‌ను కలిశారు. ఈ భేటీ జరిగిన కొద్దిసేపటికే, అదే ఎంపీల బృందం కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు భూపేందర్ యాదవ్‌ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మీటింగ్‌లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ మీటింగ్‌కు ఎవరెవరు వచ్చారనే దానిపై ఇంకా అధికారికంగా ఎలాంటి లిస్ట్ బయటకు రాలేదు.

ALSO READ : ఇకపై రెండు నెలలకు ఒకసారి..

 రెబెల్ ఎంపీలు
ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న కొందరు ఎంపీల పేర్లు చూస్తే... ప్రసూన్ బెనర్జీ, షర్మిలా సర్కార్, అరూప్ చక్రవర్తి, కలిపాడ సోరెన్, జగదీష్ చంద్ర బసునియా, కకోలి ఘోష్ దస్తిదార్, సతాబ్ది రాయ్, అసిత్ కుమార్ మాల్, జూన్ మాలియా, అబు తాహెర్ ఖాన్, ఖలీలుర్ రెహమాన్ ఉన్నారు. అయితే, ముస్లిం (మైనారిటీ) సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు కొత్త పార్టీలో లేదా కూటమిలో చేరడం అంత ఈజీ కాదని, వారిలో కొందరు మళ్లీ మమతా బెనర్జీ వైపు వచ్చే అవకాశం ఉందని టీఎంసీ లో  చర్చ జరుగుతోంది.

సుఖేందు రాయ్ రాజీనామా లేఖలో 
సుఖేందు శేఖర్ రాయ్ మమతా బెనర్జీకి పంపిన  రాజీనామా లేఖలో పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్‌లో విపరీతమైన అవినీతి, మహిళలపై అణచివేత, ప్రభుత్వ వైఫల్యం ఎక్కువైపోయాయని మండిపడ్డారు. విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, ఉపాధి, శాంతిభద్రతల విషయంలో బెంగాల్ పూర్తిగా వెనకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆయన బీజేపీని ప్రశంసించడం విశేషం. బెంగాల్ చరిత్రలో తొలిసారిగా ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులను మొదలుపెట్టిందని ఆయన అన్నారు.