ఇకపై రెండు నెలలకు ఒకసారి..ఇండియా కూటమి కీలక నిర్ణయం

ఇకపై రెండు నెలలకు ఒకసారి..ఇండియా కూటమి కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి భేటీ కావాలని కూటమి నిర్ణయించింది. సోమవారం (జూన్ 8) న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఇండియా బ్లాక్ కీలక సమావేశం నిర్వహించింది. 25 పార్టీల ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR), పేపర్ లీక్‌లు, బంధుప్రీతి పెట్టుబడిదారీ విధానం, ఎన్డీఏయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై దాడులు, అణగారిన వర్గాలపై అఘాయిత్యాలు, కేంద్రం విదేశాంగ విధానం వంటి అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. 

ఈ భేటీ అనంతరం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై ఇండియా బ్లాక్ ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమవుతుందని.. తదుపరి సమావేశం 2026, ఆగస్టు 8న జరుగుతుందని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), ఓటర్ల హక్కుల ఉల్లంఘన అంశాలపై భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడానికి ప్రతిపక్ష కూటమి ఏకగ్రీవంగా అంగీకరించిందని వెల్లడించారు. 

ఆ లేఖను త్వరలోనే ప్రధాన న్యాయమూర్తికి సమర్పిస్తామని చెప్పారు. అలాగే, నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ మూల్యంకనంలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఇండీ కూటమి ఏకగ్రీవంగా డిమాండ్ చేసిందని పేర్కొన్నారు. 25 పార్టీల భాగస్వామ్యంతో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఐదు కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. 

ALSO READ : నీట్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్లకు లాక్ డౌన్..

ఈ ఐదు అంశాలపై ఐక్యంగా పోరాడుతూ ముందుకు సాగాలని నిర్ణయించామని చెప్పారు. కాగా, ఆమ్ ఆద్మీ, డీఎంకే పార్టీలు ఇండియా కూటమి కీలక సమావేశానికి దూరంగా ఉన్నాయి. తమిళనాడు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో గుర్రుగా ఉన్న డీఎంకే ఈ సమావేశానికి డుమ్మా కొట్టగా.. ఆప్ వ్యూహాత్మకంగా ఈ సమావేశానికి దూరం పాటించింది.