హైదరాబాద్​లో ఇండ్ల అమ్మకాలు పెరిగినయ్​

హైదరాబాద్​లో  ఇండ్ల అమ్మకాలు పెరిగినయ్​
  • జులై–సెప్టెంబర్​ క్వార్టర్లో 22 శాతం గ్రోత్​
  • 7 సిటీలలో ఇదే ట్రెండ్​
  • హైదరాబాద్​లో 34 శాతం అప్‌‌‌‌ 
  • ఒక్క చెన్నైలో రివర్స్​ గేర్

న్యూఢిల్లీ: దేశంలోని 8 టాప్​ సిటీలలో ఇండ్ల అమ్మకాలు జులై–సెప్టెంబర్​ క్వార్టర్లో 22 శాతం పెరిగినట్లు ఒక రిపోర్టు వెల్లడించింది. ఇదే క్వార్టర్లో కొత్త సప్లయ్ 17 శాతం ఎగసినట్లు రియల్​ ఎస్టేట్​ డిజిటల్​ ప్లాట్​ఫామ్​ ప్రాప్​టైగర్​.కామ్​ రిపోర్టు తెలిపింది. జులై–సెప్టెంబర్​ క్వార్టర్లో 1,01,220  రెసిడెన్షియల్​ యూనిట్లు అమ్ముడయినట్లు ఈ రిపోర్టు పేర్కొంది. అంతకు ముందు ఏడాది మూడో క్వార్టర్లో ఈ అమ్మకాలు 83,220 యూనిట్లు మాత్రమే. ఢిల్లీ–ఎన్​సీఆర్​, ముంబై మెట్రోపాలిటన్​ రీజియన్​ (ఎంఎంఆర్​), చెన్నై, కోల్​కతా, బెంగళూఐరు, హైదరాబాద్​, పుణె, అహ్మదాబాద్​ సిటీలలోని అమ్మకాల డేటాను ప్రాప్​టైగర్​.కామ్​ విడుదల చేసింది. ఒక్క చెన్నై సిటీ మినహా మిగిలిన ఏడు సిటీలలోనూ ఇండ్ల అమ్మకాలు గ్రోత్ రికార్డు చేశాయని ఈ రిపోర్టు వివరించింది. మొత్తం ఇండ్ల అమ్మకాలలో సగానికిపైగా ముంబై మెట్రోపాలిటన్​ రీజియన్​, పుణె సిటీలలోనే జరిగినట్లు తెలిపింది.

మరోవైపు కొత్త ప్రాజెక్టు లాంఛెస్​ కూడా ఈ ఏడాది మూడో క్వార్టర్లో 17 శాతం పెరిగాయని, 1,23,080 కొత్త ఇండ్ల నిర్మాణపు ప్రాజెక్టులను కంపెనీలు ప్రకటించాయని ప్రాప్​టైగర్​.కామ్​ రిపోర్టు వెల్లడించింది. 

అంతకు ముందు ఏడాది అంటే 2022 మూడో క్వార్టర్లో కొత్త లాంఛెస్​ 1,04,820 యూనిట్లేనని పేర్కొంది. టాప్​ 8 సిటీలలో హౌసింగ్​ మార్కెట్లు జోరందుకుంటున్నాయని, కన్జూమర్​ సెంటిమెంట్​ పాజిటివ్​గా ఉండటమే దీనికి కారణమని ప్రాప్​టైగర్​.కామ్​ బిజినెస్​ హెడ్​ వికాస్​ వాధ్వాన్​ చెప్పారు. పెంటప్​ డిమాండ్​తోపాటు, ప్రజల ఆదాయాలలో పెరుగుదల, వడ్డీ రేట్లు నిలకడగా ఉండటం, ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్​ పెరగడంతో ఇండ్ల అమ్మకాల మొమెంటమ్ ఊపందుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

ఇండ్ల అమ్మకాలు జులై–సెప్టెంబర్​ 2023 క్వార్టర్లో అహ్మదాబాద్​లో 31 శాతం, బెంగళూరులో 60 శాతం, ఢిల్లీ–ఎన్​సీఆర్​లో 44 శాతం, కోల్​కతాలో 43 శాతం, హైదరాబాద్​లో 34 శాతం, ముంబైలో 5 శాతం, పుణెలో 18 శాతం  పెరిగినట్లు తెలిపారు. ఈ క్వార్టర్లో చెన్నైలో ఇండ్ల అమ్మకాలు 3,870 యూనిట్లకే పరిమితమైనట్లు వెల్లడించారు.