ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కనుమకింద కొట్టాలలో బుధవారం (జూన్ 28) ఆదిమానవుడు నివసించిన ఆనవాల్లు, బిల్లా గుహలు ( ఎర్రమల కొండలు )ప్రాంతాలను ... పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు రెండు కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రి బుగ్గన గ్రామానికి వెళ్లారు. మంత్రి వెంట అధికారులు, అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఓ చెట్టు దగ్గర ఉండి పనులను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 40 మంది వరకు గాయాలు కాగా మంత్రి బుగ్గనను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. గాయపడ్డ వారిని సమీపంలోని బేతంచర్ల పీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మంత్రి బుగ్గన ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితుల్లో తీవ్రంగా గాయపడిన ఆరుగురికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి బుగ్గన వైద్యులకు సూచించారు. ఇదిలా ఉండగా మూడు నెలల కిందట బేతంచెర్ల మండలంలోని సీతారామపురం గ్రామంలో బీటీ రోడ్ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వెళ్లిన సందర్భంలో కూడా మంత్రి బుగ్గన పై తేనెటీగలు దాడి చేశాయి. ఆ సమయం కూడా మంత్రి బుగ్గన తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు .
